ఇరాన్ – ఇజ్రాయిల్ గా మొదలైన యుద్ధం పోనుపోను ఇరాన్ – అమెరికా యుద్ధం గా మారిపోయింది. అగ్రరాజ్యం తో యుద్ధం అన్నా కూడా ఇరాన్ ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగా దూకుడుగా అమెరికా కు కౌంటర్లు ఇస్తుంది. ఈ రెండు దేశాల యుద్ధ ప్రకటనలతో ప్రపంచ దేశాలు మొత్తం అల్లాడుతున్నా ఇందులో ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధపడడం లేదు.
ఇరాన్ హార్మోజ్ జలసంధిని నిర్బంధించడంతో ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో తలలు పట్టుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు భారత్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాల అరుదుగా కనిపించిన ఈ ఇంధన కొరత ఇప్పుడు రోడ్ల మీద కిలోమీటర్ల క్యూ లైన్ల రూపంలో దర్శనమిస్తుంది.
అటు డిమాండ్ కి తగ్గ సప్లై లేక వంట గ్యాస్ కొరతతో ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్, పీజీ, హాస్టల్స్ వంటి సముదాయాలు తాత్కాలికంగా షటర్స్ క్లోజ్ చేస్తున్నాయి. ఇక పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు వాహనదారులను ఆందోళనలోకి నెడుతున్నాయి.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సాగిన తొలిదఫా చర్చలలో ఇరాన్ – అమెరికా తాము పట్టిన కుందేలుకి ముందే కాళ్ళు అన్నట్టుగా తమ తమ డిమాండ్ల కు కట్టుబడి ఉన్నారు. తరువాత జరిగిన చర్చలలో ఈ రెండు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, యుద్ధం త్వరలోనే ఒక ముగింపుకి రాబోతుందంటూ అమెరికా ప్రకటనలు చేసింది.
దీనితో ప్రపంచ స్టాక్ మార్కెట్లు సైతం సుదీర్ఘ గ్యాప్ తరువాత లాభాల బాటపట్టాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరగడం, ఇక నుంచి ఇరాన్ తో చర్చలన్నీ ఫోన్ కాల్స్ లో జరుగుతాయంటూ అమెరికా ప్రకటించడం, మా డిమాండ్లకు ఇరాన్ తలవంచని పక్షంలో ఇరాన్ ఆయిల్ పైప్ లైన్ ను పేల్చేస్తామంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో,
అమెరికా ప్రకటనలకు ధీటుగా ఇరాన్ సైతం ఒకటికి నాలుగు అంటూ సమాధానం ఇస్తూ…తమ ఆయిల్ పైప్ లైన్ ల మీద అమెరికా దాడికి తెగబడితే అందుకు ప్రతిగా తాము పశ్చిమాసియాలో అమెరికా మిత్రపక్ష దేశాలలో నాలుగు రెట్ల విధ్వంశం సృష్టిస్తామని, ‘మాది ఒక ఆయిల్ బావి అయితే మీవి నాలుగు’ అంటూ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ బదులిచ్చారు.
దీనితో ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం కథ మళ్ళీ మొదటికొచ్చినట్లయ్యింది. ఇక ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేదెప్పుడు.? ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభం నుంచి బయటపడేదెప్పుడు.? ఈ ఒక్క ఇంధన కొరత అన్ని రంగాల పై ప్రభావం చూపిస్తూ ప్రపంచ దేశాలను మెల్లిమెల్లిగా ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తుంది.







