పదిరోజుల నుంచి రిమాండ్పై జైలులో ఉన్న పట్టాభికి ఎట్టకేలకు నేడు బెయిల్పై రాజమండ్రి జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి అనుచరులు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. ఈ పదిరోజులలో అంతగా బలహీనపడ్డారు.
నేడు కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్నప్పుడు, పోలీసులు మళ్ళీ ఆయన కస్టడీని కోరుతూ పిటిషన్ వేయడం విస్మయం కలిగిస్తుంది. కానీ పట్టాభి తరపున సీనియర్ అడ్వకేట్ పోసాని వెంకటేశ్వర్లు పోలీసులు రాజకీయ కారణాలతోనే ఘటన స్థలంలో లేని పట్టాభిపై కేసు పెట్టారని గట్టిగా వాదించడంతో న్యాయస్థానం పోలీసుల పిటిషన్ కొట్టివేసి పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల చొప్పున రెండు ష్యూరిటీలని సమర్పించాలని పట్టాభిని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు పోలీసుల సమక్షంలోనే టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఆవరణలో నిలిపి ఉంచిన కార్లకు నిప్పు పెట్టడం యావత్ రాష్ట్ర ప్రజానీకం ప్రసార మాద్యమాల ద్వారా చూశారు. కనుక పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తారని ఆశించడం సహజం. కానీ వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన టిడిపి సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టిడిపి కార్యకర్తలపై కేసులు నమోదు చేసి లోపల వేశారు. కారణం ఏం చెప్పారంటే, అక్కడే విధులు నిర్వహిస్తున్న సిఈ కనకారావుపై వారు దాడి చేసి గాయపరిచారని!
టిడిపి కార్యాలయంపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టినవారిని కాకుండా పట్టాభిని, టిడిపి కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడంపై జిల్లా టిడిపి నేతలు స్పందిస్తూ “అయితే వంశీ అనుచరులు చేసిన నేరం అంత పెద్దది కాదనుకోవాలేమో…” అని ఆక్షేపించారు.



