70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, ఎర్రకోటపై నుంచి తాను ఏం మాట్లాడాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరిన వేళ… ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్ స్పందించారు. రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున పాల్గొంటున్న క్రీడాకారులకు మానసిక ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడాలని, దేశానికి పేరు తెచ్చిన ఆటగాళ్లను ప్రస్తావించాలని కోరారు. రియోలో ఓటమి పాలైన అథ్లెట్లలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలని సూచించారు.
“ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న ఆటగాళ్లు మీ నుంచి వచ్చే మాటలు కొంత కోలుకునేందుకు సహకరిస్తాయి. తదుపరి తమ ఆటను మెరుగు పరచుకునేందుకు తోడ్పడతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ కలుస్తున్న ఆటగాళ్లు ఎంతో అనుభవాన్ని సాధించారు” అని సచిన్ అన్నారు. రియలో ఒలింపిక్స్ కు వెళ్లిన భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ, ఒలింపిక్స్ తొలి రోజు నుంచే భారత జట్టుతో కలిసి ఉన్నారు.
సచిన్ చెప్పిన సలహాపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ… “భారత క్రీడాకారుల్లో అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్న సచిన్, అథ్లెట్ల గురించి ఆగస్టు 15 ప్రసంగంలో మాట్లాడాలని సూచించారు. ఆయన ఆలోచనను అభినందిస్తున్నా. ఈ విషయం మాట్లాడేందుకు ఆగస్టు 15 వరకూ ఆగడం ఎందుకు? ఇప్పుడే మాట్లాడుతా” అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు మోడీ.
“రియో ఒలింపిక్స్ లో మన ఆటగాళ్లుండటం ఎంతో గర్వకారణం. వారెంతో శ్రమిస్తున్నారు. విజయం, పరాజయం జీవితంలో ఓ భాగం. మిగిలిన అన్ని ఆటల్లో పోటీ పడుతున్న వారు తమ అత్యుత్తమ ఆట తీరును కనబరచాలి. ఫలితం గురించిన బెంగ వద్దు. ఓర్పు, సంకల్పం, అంకితభావంతో ప్రతి భారత అథ్లెట్ ముందుకు సాగాలి. ఆటగాళ్లంతా భారత్ కు గర్వకారణం. వారు జాతి యావత్తూ గర్వపడేలా చేయాలి” అని ట్వీట్లు చేసి… సచిన్ చెప్పినట్లుగా క్రీడాకారుల్లో మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేసారు మోడీ.



