నిన్న కాక మొన్న ‘దువ్వాడ జగన్నాధమ్’ కృతజ్ఞతల సభ పైన సోషల్ మీడియాలో అభిమానులందరూ కలిసి ఉండాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచాలని పిలుపునిచ్చారు నిర్మాత దిల్ రాజు. కట్ చేస్తే… ఈ సినిమాను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై విచారణ చేస్తామని పోలీసులు కూడా స్పష్టం చేసారు.
దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన దిల్ రాజు… సంచలన వ్యాఖ్యలు చేసారు. “డీజే” సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, ఎలాగైనా ఈ సినిమా కలెక్షన్స్ ను దెబ్బ తీయాలి అన్న ఉద్దేశంతో, ఫేస్ బుక్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలలో ఈ సినిమాను అప్ లోడ్ చేసారని, దీనిపైనే ఫిర్యాదు చేసామని అన్నారు.
ఇక దర్శకుడు హరీష్ శంకర్ ప్రసంగిస్తూ… గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ‘డీజే’ సినిమాను విపరీతంగా షేర్ చేస్తున్నారని, ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ ఇండియన్ మూవీ హిస్టరీలోనే టాప్ 5లో నిలుస్తుందని, ఈ సినిమా కలెక్షన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన హరీష్ శంకర్, ఇలా ఏకంగా సోషల్ మీడియాలోనే సినిమా అప్ లోడ్ చేస్తే రికార్డులకు చేరుకోలేమని అన్నారు.
థ్యాంక్యూ మీట్ లో ‘ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది మంచి వాళ్ళున్నారని ఈ సందర్భంగా రుజువైందని’ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ‘కొందరు చెడ్డోళ్ళ’ గురించి వ్యాఖ్యానించినట్లయ్యింది. తాజాగా దిల్ రాజు కూడా తమ సినిమా కలెక్షన్స్ ను చూసి ‘కొందరు ఓర్వలేకపోతున్నారని’ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ ‘డీజే’ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తోన్న “ఆ కొందరు” ఎవరు? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
హరీష్ శంకర్ అయితే ఈ పైరసీ అంశంలోనే మహేష్, తారక్ ఫ్యాన్స్ కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు కనుక, మిగిలి ఉన్న టాప్ హీరోల ఫ్యాన్స్ ను ఉద్దేశించే దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేసారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, అభిమానులంతా ఇతర హీరోలను గౌరవించాలని చెప్పిన దిల్ రాజు, హరీష్ శంకర్ ల మాటలు కేవలం వాటిని డైలాగ్స్ కే పరిమితం కానున్నాయా?
దిల్ రాజు దృష్టిలో ‘డీజే సక్సెస్ ను ఎవరు ఓర్వలేకపోతున్నారు?’ ఈ ప్రశ్నలకు రాజు, హరీష్ లే సమాధానం చెప్పాలి. పైరసీ అనేది ఖచ్చితంగా నియత్రించాల్సిన అంశమే. కోట్లకు కోట్లు పెట్టుబడులుగా పెట్టిన నిర్మాతలకు పైరసీ అనేది కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దానికి ఎవరు పాల్పడినా శిక్షార్హులే. అయితే పైరసీ పేరుతో “ఆ కొందరిని” టార్గెట్ చేసేలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి..!



