తెలంగాణ శాసనసభ ఎన్నికలలో గెలిచి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలని కేసీఆర్ తహతహలాడుతుంటే, 2024 ఎన్నికలలో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ తహతహలాడుతున్నారు. ఇది సహజమే.
అయితే తెలంగాణ కేసీఆర్ గెలుపు జగన్కు, ఏపీలో జగన్ గెలుపు కేసీఆర్కి చాలా అవసరమే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి.
ఏపీలో జగన్ సిఎంగా ఉన్నంత కాలం తెలంగాణకు పరిశ్రమలు, ఐటి కంపెనీలు క్యూ కడుతూనే ఉంటాయి. కనుక తెలంగాణ అభివృద్ధికి ఢోకా ఉండదు. అలాగే కృష్ణాగోదావరి జలాల పంపకాలపై కూడా జగన్ ప్రభుత్వం పెద్దగా పట్టుబట్టదు. కనుక కేసీఆర్ యదేచ్చగా ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ అంతటా నీళ్ళు తరలించుకుపోవచ్చు.
ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడే. కనుక తెలంగాణ సిఎంగా కేసీఆర్ ఉంటే, ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడుతుంటారు. అప్పుడప్పుడు తెలంగాణ మంత్రులు ఏపీని, జగన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నప్పటికీ అంతకు మించి మరే ఇబ్బందులు ఉండవు.
అప్పులు, కేసుల కోసం జగన్, విజయ సాయిరెడ్డి ఇద్దరూ మోడీ, అమిత్ షాలకు విధేయంగా ఉంటున్నప్పటికీ, వారితో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకవేళ ఏపీలో జనసేనతో పొత్తుల కోసం వైసీపి ప్రభుత్వం పట్ల వారి వైఖరి మార్చుకొంటే, జగన్, విజయ సాయిరెడ్డి ఇద్దరికీ కష్టాలు మొదలవుతాయి.
ఇక తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, కూతురు కవిత కోసం వెనక్కు తగ్గాల్సి వస్తోంది. అలాగే కొడుకు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనుకొంటున్నారు. కనుక జాతీయ రాజకీయాలకు షిఫ్ట్ అవడం కేసీఆర్కు అవసరమే.
అందుకే తెలంగాణతో పాటు మహారాష్ట్రలో మరికొన్ని లోక్సభ సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ లోక్సభ ఎన్నికలలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే, అప్పుడు జగన్ కూడా కేసీఆర్తో చేయి కలపడం ఖాయమే. అప్పటి పరిస్థితులను బట్టి మరికొన్ని పార్టీలు వారితో చేతులు కలపవచ్చు. వారిరువురూ కలిసి 70-100 ఎంపీలను సమకూర్చుకోగలిగితే ఇక వారికి తిరుగు ఉండదు. కనుక జగన్, కేసీఆర్ ఒకరి గెలుపు మరొకరికి చాలా అవసరమే అని చెప్పవచ్చు.




