టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో ఆయన నివాసంలో కలిసి ఏపీలో వైసీపి ప్రభుత్వం ఏవిదంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందో వివరించారు. చంద్రబాబు నాయుడు భద్రతపై తామందరం తీవ్ర ఆందోళన చెందుతున్నామని అమిత్ షాకు చెప్పామని ట్వీట్ చేశారు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పటి నుంచే అమిత్ షాని కలిసి ఇవన్నీ వివరించాలని నారా లోకేష్ ప్రయత్నించారు. కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ లభించలేదు. నారా లోకేష్ పోస్ట్ చేసిన ఫోటోలో పక్కనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇద్దరూ ఉండటంతో వారిరువురూ చొరవ తీసుకొని నారా లోకేష్కు ఈ అపాయింట్మెంట్ ఇప్పించి ఉండవచ్చని అర్దమవుతుంది.
వారి భేటీ, ఈ ఫోటోపై వైసీపి ఏవిదంగా స్పందిస్తుందో ఊహించుకోవచ్చు. అందుకు ఆమె సిద్దపడే ఈ భేటీలో పాల్గొన్నారని భావించవచ్చు.
దగ్గుబాటి పురందేశ్వరి తన సోదరి భువనేశ్వరికి వచ్చిన ఈ కష్టాన్ని చూస్తూ ఊరుకోలేరు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె తన పార్టీ భవిష్యత్ గురించి కూడా ఆలోచించి చొరవ తీసుకొని ఈ భేటీ ఏర్పాటు చేయించి ఉండవచ్చు. దీనిలో దాపరికం ఏమీ లేదని ఫోటోతో స్పష్టం అయ్యింది.
ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్, తెలుగువారి సత్తా తెలియజేసేందుకు వైఎస్సార్ ఢిల్లీ పెద్దలతో పోరాడారు. కానీ జగన్ తీరు వలన ఇప్పుడు ఆయనతో సహా అందరూ ఆత్మాభిమానం చంపుకొని ఏపీలో పంచాయితీలపై తీర్పు చెప్పాలంటూ అమిత్ షా ముందు ఇలా చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తోంది.
ఒకవేళ వైసీపి ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన, రాజకీయాలు చేస్తున్నట్లయితే టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోవలసిన అవసరమే ఉండేది కాదు. ఢిల్లీలో చేతులు కట్టుకొని ఇలా నిలబడాల్సి వచ్చేదే కాదు కదా?కనుక వైసీపి నేతలు నారా లోకేష్, పురందేశ్వరిలని నిందించడం కాదు తమను తామే నిందించుకోవాలి ఏపీ నేతలకు ఇటువంటి దుస్థితి కల్పించినందుకు.
ఇంతకాలం మోడీ, అమిత్ షాలు ఈ వ్యవహారంపై స్పందించకుండా మౌనంగా ఉండటం వలన ఏపీ ప్రజలకు, పార్టీలకు కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. తెలంగాణలో కేసీఆర్తో మేము కుమ్మక్కు అవలేదని ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు ఆ రాష్ట్ర ప్రజలకు నచ్చజెప్పుకోవలసివస్తోంది. ఇప్పుడు ఏపీలో ప్రజలకు కూడా తాము జగన్తో కుమ్మక్కు అవలేదని చెప్పుకొనే పరిస్థితి రావచ్చు. ఒకవేళ ఈ వ్యవహారంలో తాము కలుగజేసుకోలేదని చెప్పేసినా మంచిదే. కానీ బీజేపీ అధిష్టానం ఇంకా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తే చివరికి నష్టపోయేది ఏపీ బీజేపీయే. ఈ విషయం దగ్గుబాటి పురందేశ్వరికి బాగా తెలుసు. కనుకనే ఆమె చొరవ తీసుకొని ఈ భేటీ ఏర్పాటు చేయించి ఉండవచ్చు.



