ప్రతిపక్ష నేత, వైస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. కుమారుడు హితేశ్తో కలిసి లోటస్పాండ్లోని జగన్ నివాసంలో ఆయన్ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ప్రకాశం జిల్లాలో వైకాపా టికెట్ ఇచ్చే అంశంపై జగన్తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చించినట్లు సమాచారం. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. వైకాపాతో కలిసి పనిచేయడానికి తన కుమారుడు హితేశ్ నిర్ణయించారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకోసమే వైకాపా అధినేత జగన్ను కలిసినట్లు చెప్పారు.
పార్టీతో కలిసి పనిచేసే అంశంపై మాత్రమే చర్చించామని, ఎప్పుడు చేరేది త్వరలో వెల్లడిస్తామని వివరించారు. ప్రకాశం జిల్లా పరుచూరు టికెట్ గురించి చర్చించారా? అన్న ప్రశ్నకు.. పార్టీనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే జగన్ నుండి టిక్కెట్ గురించి హామీ లభించాకే వారు ఆయన ను వారు కలిసారని సమాచారం. ఇదే సమయంలో తన సతీమణి పురందేశ్వరి రాజకీయాల్లో ఉంటే బీజేపీలోనే కొనసాగుతారని తెలిపారు. లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని, అది ఆమె వ్యక్తిగత అంశమని చెప్పారు.
గత కొద్ది కాలంగా పురందేశ్వరి కూడా బీజేపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆవిడను సముదాయించడానికి ఏపీ బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. కుమారుడి చేరికతో బీజేపీలో నే ఉండాలని పురందేశ్వరి నిర్ణయించుకున్నా ఆమెకు పార్టీలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈక్రమంలో ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చంద్రబాబు తొడల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వర రావు మరోసారి చంద్రబాబు వ్యతిరేక క్యాంపు లొకే వెళ్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్సార్సీపీ..



