సోమవారం సాయంత్రం సుమారు 6.45 గంటలకు ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఓ కారులో భారీగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఆ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. కనుక ఈ ఘటనలో 11 మంది చనిపోగా మరో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పివేశారు. జాతీయ దర్యాప్తు బృందం, ఫోరెన్సిక్ బృందం, ర్యాపిడి యాక్షన్ ఫోర్స్, బాంబ్ డిస్పోసల్ బృందం అక్కడకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర హోం శాఖ హైదరాబాద్, ముంబయి, బెంగళూరుతో సహా దేశంలో అన్ని ప్రధాన నగరాలలో హై అలర్ట్ ప్రకటించింది.
జాతీయ నిఘా సంస్థ గత కొన్ని రోజులుగా ఉగ్రదాడులకు జరుగుతున్న కుట్రలు భగ్నం చేస్తున్నాయి. ఆదివారం ఫరీదాబాద్లో ఓ వైద్యుడుని అరెస్ట్ చేసి అతని ఇంట్లో నుంచి భారీగా ప్రేలుడు పదార్ధాలు, ఒక రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అతనిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తుండగానే ఢిల్లీలో ఈ భారీ పేలుడు జరిగింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ కారులో భారీగా బాంబులు అమర్చి రిమోట్ లేదా టైమర్తో ఈ పేలుడు జరిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది ఉగ్రవాద దాడా… కాదా? అనే విషయం కేంద్ర ప్రభుత్వం ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసరం సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్ ముగించిన తర్వాత మళ్ళీ మరోసారి భారత్పై ఉగ్రదాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని పాకిస్తాన్ని భారత్ హెచ్చరించింది. కనుక ఇది ఉగ్రదాడే అయితే మళ్ళీ భారత్-పాక్ మద్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.







