‘కబాలి’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు తనయురాలిగా నటించిన ధన్షికకు కోలీవుడ్ లో మంచి గుర్తింపు రావడంతో, సినీ అవకాశాలు క్యూలు కట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే “విళితిరు” అనే సినిమాలో నటించగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ ను పెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ధన్షిక… చిత్ర యూనిట్ సభ్యులలోని అందరి పేర్లు చెప్పి, ప్రముఖ హీరో శింబు తండ్రి టి.రాజేందర్ పేరును మరిచిపోయింది.
దీనిని తన అవమానంగా భావించిన రాజేందర్ ఆ స్టేజ్ పైనే ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘సూపర్ స్టార్స్’తో నటించినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు కాలేరని, సహచర ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని, పెద్దలను గౌరవించడం నేర్చుకోకపోతే భవిష్యత్ ఉండదని ఒక స్థాయిలో మండిపడ్డారు. దీంతో తన పొరపాటును గమనించుకున్న ధన్షిక, మైక్ అందుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది.
తనకు వేడుకలపైన ప్రసంగించే అలవాటు లేదని, అందువలనే పొరపాటు జరిగింది తప్ప, తాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఈ సందర్భంగా క్షమాపణలు కోరింది. ధన్షిక ఇంత చెప్పినప్పటికీ, శాంతించని రాజేందర్, మళ్ళీ సదరు హీరోయిన్ పై శివాలెత్తిపోవడంతో, ధన్షిక స్టేజ్ పైనే కన్నీటి పర్యంతం అయ్యింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఈ సినిమాలో రాజేందర్ కేవలం ఒక పాట మాత్రమే ఆలపించారు. అది ప్రస్తావించనందుకే ఈ రాద్ధాంతం అంతా!


