జగనన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొన్న వైఎస్ షర్మిల, వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు బెంగళూరు వెళ్ళి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినందుకు, రెండోసారి ఆయన మంత్రి పదవి చేపడుతునందుకు అభినందించేందుకే బెంగళూరు వెళ్ళి ఆయనను కలిశానని షర్మిల చెప్పుకొన్నారు. కానీ ప్రియాంకా గాంధీ సూచన మేరకే ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే విషయమై మాట్లాడేందుకు శివకుమార్ను కలిశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె అందుకు అంగీకరిస్తే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చిన్నట్లు వాటి సారాంశం.
అయితే రాజకీయాల కోసం కాదు… ఆస్తుల పంపకాల విషయంలో జగనన్నతో రాయబారం నెరిపి న్యాయం చేయాలని కోరేందుకే షర్మిల బెంగళూరు వెళ్ళి శివకుమార్ని కలిశారనే మరో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
వాటిలో ఏదో ఒకటి నిజమని ధృవీకరిస్తున్నట్లు శివకుమార్ బుదవారం ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజ మండలంలోని చిలకపాడులో శివాలయంలో శివలింగప్రతిష్టకు ఆహ్వానిస్తే వచ్చానని, ఎటువంటి రాజకీయ పనుల కోసం కాదని శివకుమార్ చెప్పారు.
వైఎస్ కుటుంబంతో తనకు చాలా కాలంగా అనుబందం ఉందని, షర్మిల తనకు సోదరి వంటిదని అందుకే ఆమె తనను అభినందించడానికి బెంగళూరు వచ్చిందని శివకుమార్ చెప్పారు. తమ మద్య ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదని చెప్పారు. “ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకోబోతున్నారా?” అనే విలేఖరుల ప్రశ్నకు “ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను,” అని అన్నారు.
ఆయన ఆ ప్రశ్నకు ‘అవును’ లేదా ‘కాదు’ అని సమాధానం చెప్పవచ్చు. కానీ చెపితే మరిన్ని ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుంది కనుక సమాధానం చెప్పకుండా దాటవేశారు. అయితే ఏనాడూ ఏపీలో అడుగుపెట్టని ఆయన, కేవలం శివలింగ ప్రతిష్ట కోసమే బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం కట్టించుకొని వచ్చారంటే నమ్మశక్యంగా లేదు. కనుక అన్నాచెల్లెళ్ళ ఆస్తుల పంపకాల కోసమా లేక ఏపీ కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల గురించి మాట్లాడేందుకు వచ్చారా?అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.



