రాజకీయాలలో బంధాలకు స్థానం లేదా.?

kavitha-ys-sharmila

రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనేది ఎంత వాస్తవమో అలాగే రాజకీయాలకు తన మన అనే బేధం కూడా ఉందనేది నేటి రాజకీయ పరిస్థితులను చూస్తే యిట్టె అర్ధమవుతుంది.

పార్టీ అధినేతల కుటుంబాల నుంచి పార్టీ నాయకుల కుటుంబాల వరకు అందరూ ఎదో ఒక సమయంలో, ఎదో ఒక సందర్భంలో సొంత కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ విబేధాలు ఎదుర్కోవడం సర్వ సామాన్యమయిపోయింది.

ADVERTISEMENT

వైసీపీ పార్టీలో మొదలైన షర్మిల వివాదం తో వైస్ కుటుంబంలో నాడు మొదలైన రాజకీయ చిచ్చు నేటికీ ఎదో ఒక రూపంలో రాచుకుంటూనే ఉంది. తల్లి విజయలక్ష్మిని వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన నాటి నుంచి తండ్రి వైఎస్ఆర్ ఆస్తుల మీద హక్కుల కోసం తల్లి పై కోర్టులో కేసులు వేసే వరకు వైసీపీ రాజకీయం కుటుంబ సభ్యుల మధ్య నలిగిపోయింది.

ఇక ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కవిత రూపంలో బిఆర్ఎస్ పార్టీలో నిప్పంటుకుంది. పార్టీ పూర్తి బాధ్యతలు కేటీఆర్ చేతిలోకి వెళ్లిపోనున్నాయి అనే సంకేతాలతో బిఆర్ఎస్ లో మొదలైన కవిత మంటలు నానాటికి విస్తరిస్తున్నాయి. ఇలా ఈ రెండు పార్టీలలో అధినేతలు సొంత కుటుంబ సభ్యుల నుంచే రాజకీయ విమర్శలను ఎదుర్కొంటు పార్టీని బలహీనపరుచుకుంటున్నారు.

అయితే ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ పై జగన్ పై అటు రాజకీయంగా ఇటు కుటుంబ పరంగా విమర్శనా బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇటు కవిత విషయానికొస్తే ఇప్పుడిపుడే బిఆర్ఎస్ కు పరోక్షంగా దూరమవుతున్న కవిత జాగృతితో సొంత కుంపటి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నారు.

తాజాగా తండ్రి కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకునే సమయంలో కూడా ఆయన పక్కన కేటీఆర్, హరీష్ మాత్రమే కనిపిస్తున్నారు. దీనితో కవితకు కేసీఆర్ పర్మిషన్ ఇవ్వలేదా.? లేక కవిత చెప్పినట్టుగా కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు కవితను కేసీఆర్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారా అనేది తెలియాలి.

ఇటు ఇలా పార్టీల అధినేత కుటుంబాలలోని కాదు పార్టీలోని కొంతమంది నాయకుల కుటుంబాలలో కూడా ఈ తరహా కుటుంబ రాజకీయం నడుస్తూ కుటుంబ బంధాలకు దూరమవుతున్నారు. అందులో ఎక్కువగా వైసీపీ పార్టీల నాయకుల పేర్లే ప్రచారంలో ఉండడం యాదృచ్ఛికం.

ఇందులో కుల పెద్ద, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన కుటుంబంలో కూడా అటు తండ్రి – కూతుర్ల మధ్య అన్నా – చెల్లెళ్ళ మధ్య మొదలైన రాజకీయ చిచ్చు ఇప్పుడు వ్యక్తిగత వైరంగా మారి తండ్రి ముద్రగడ ఆరోగ్యం చుట్టూ తిరుగుతుంది.

నా తండ్రి ముద్రగడకు క్యాన్సర్ వచ్చింది, నా అన్న గిరి ఆయనకు మెరుగైన వైద్యం అందించడం లేదు, గిరి ఆయన మామ ముద్రగడను కలిసేందుకు అడ్డుగోడల మారుతున్నారు అంటూ సొంత కుటుంబసభ్యుల మీదే ఈ రకమైన ఆరోపణలు చేసారు ముద్రగడ కుమార్తె క్రాంతి. ఇక ముద్రగడ స్పందిస్తూ తన ఆరోగ్యం మీద ప్రచారమవుతున్న వార్తలన్నీ అవాస్తవాలని, అవన్నీ రాజకీయ కుట్రలో భాగమేమని కొట్టిపారేశారు.

ఇలా తండ్రి, కూతుర్లు, అన్నా చెల్లలు మధ్య కూడా ఈ రకమైన రాజకీయ విద్వేషాలు రాచుకోవడంతో రాజకీయాలలో బంధాలకు స్థానం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక బాధ్యత యుతమైన స్థానంలో ఉన్న వారే ఇలా కుటుంబాలను కలుపుకుపోకుండా ముందుకెళ్లడం అది వారి పార్టీ కే కాదు వారి వ్యక్తిగత ఇమేజ్ కు కూడా హానికరం.

ADVERTISEMENT
Latest Stories