వైసీపి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్దపడుతున్నారు. జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు,బోనబోయిన శ్రీనివాస్ శనివారం గుంటూరులో ఆయన నివాసానికి వెళ్ళి చాలాసేపు మాట్లాడారు. కనుక జనసేనలో చేరుతున్నట్లు నేడో రేపో ప్రకటించవచ్చు.
నిజానికి ఎంపీ బాలశౌరి ఏదో రోజు వైసీపి నుంచి బయటకు వస్తారని అందరికీ తెలుసు. వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీ బాలశౌరిని కాదని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, మంత్రి జోగి రమేశ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో వారివురూ ఆయన తమ నియోజకవర్గాల అడుగుపెట్టనీయకుండా అడ్డుపడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు.
ఆయన ఈవిషయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకపోవడంతో ఇంతకాలం ఆయన వైసీపిలో ఇబ్బంది పడుతూనే సర్దుకుపోయారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన వైసీపి నుంచి బయటకు వస్తున్నారు.
బాలశౌరి జనసేనలో చేరి మచిలీపట్నం నుంచి లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేస్తే ఆయన ఎన్నికలలో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో వైసీపికి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయి. కనుక టిడిపి, జనసేనల తరపున బలమైన అభ్యర్ధులను నిలబెడితే అవలీలగా విజయం సాధించగలరు.
కానీ బాలశౌరిని జనసేనలో చేర్చుకునే ముందు మచిలీపట్నం లోక్సభ సీటుని జనసేనకు టిడిపి ఇస్తుందా లేదా?అనేది తేల్చుకోవలసి ఉంటుంది. అందుకు టిడిపి అంగీకరిస్తే బాలశౌరి చేరికతో జనసేన ఓ ఎంపీ సీటు గెలుచుకున్నట్లే భావించవచ్చు.




