హైదరాబాదులో డ్రగ్ దందా వెలుగు చూసిన అనంతరం సిట్ సినీ ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ దందాపై పూర్తి వివరాలు సేకరించిన ఆంగ్లపత్రిక జర్నలిస్టు ఓ ప్రత్యేక కధనాన్ని ప్రచురించింది. డార్క్ నెట్ సైట్ ద్వారా దందా జరుగుతుందని గుర్తించిన జర్నలిస్టు భారత్ కు ఎవరు ఎక్కువగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న విషయాన్ని శోధించి తెలుసుకున్నారు.
భారత్ కు మ్యాడ్లీబూటెడ్ ఐడీతో పెడ్లర్ ఒకరు భారీగా మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నాడు. దీనిపై పూర్తి వివరాలు తెలిసేలా సదరు జర్నలిస్టు కథనంలో పూర్తి వివరాలు రాశాడు. ఇది జర్నలిస్టు పేరుతో సహా ప్రసారమైంది. అంతే ఈ కథనం చదివిన సదరు డ్రగ్ పెడ్లర్… ఇంటర్నెట్ లో ఫత్వా జారీ చేశాడు. ఫేస్ బుక్ ద్వారా సదరు జర్నలిస్టు, అతని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన డ్రగ్ పెడ్లర్…
వాటితో ఒక పోస్టర్ తయారు చేసి, ఇతర వివరాలు వెల్లడిస్తూ, అతనిని చంపిన వారికి నాలుగు బిట్ కాయిన్లు (7.2 లక్షలు), కుటుంబ సభ్యుల్ని చంపితే ఆరు బిట్ కాయిన్లు (10.8 లక్షలు) అందజేస్తానని వెలకట్టాడు. దీనిని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్న సదరు జర్నలిస్టు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీ అడ్రస్ ద్వారా డ్రగ్ పెడ్లర్ ను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.


