ఆ డ్రగ్స్ అన్నీ ఆవిరైపోయాయి.. నమ్మాలంతే!

Drugs CBI Shipping Container Visakhapatnam Port

ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు ముందు అంటే ఈ ఏడాది మార్చి 16న బ్రెజిల్ నుంచి ఓ షిప్పులో పెద్ద కంటెయినర్ వచ్చింది. దానిలో మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఇంటర్ పోల్ సమాచారం అందుకొని ఢిల్లీ నుంచి సీబీఐ అధికారి అధికారులు వచ్చి ఆ కంటెయినర్‌ని స్వాధీనం చేసుకొని దానిలో పదార్ధాలను పరీక్షల కొరకు గుజరాత్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

ADVERTISEMENT

మొత్తం 47 నమూనాలు పంపగా వాటిలో 27 నమూనాలలో మాదక ద్రవ్యాల అవశేషాలున్నట్లు నివేదిక వచ్చింది. కానీ 8 నెలల తర్వాత వాటిలో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవని, అది డ్రైడ్ ఈస్ట్ మాత్రమే అని సీబీఐ తేల్చి చెప్పింది. కనుక ఆ కంటెయినర్‌ని దానిలో ఉన్న 25,000 టన్నుల సరుకుని దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా కంపెనీ తీసుకువెళ్ళేందుకు అనుమతించవచ్చని విశాఖ పోర్టు అధికారులకు లేఖ ద్వారా తెలియజేసింది.

ఎన్నికలకు ముందు ఈ కంటెయినర్-మాదక ద్రవ్యాల వ్యవహారంపై వైసీపీ, టీడీపీ, బీజేపిల మద్య పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. ఇది రాష్ట్ర బీజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువులకు చెందినదని, ఈ మాదక ద్రవ్యాల దిగుమతితో ఆమె కుటుంబానికి కూడా సంబందం ఉందని వైసీపీ నేతలు వాదించారు.

ఈ మాదక ద్రవ్యాల దిగుమతితో టీడీపీ నేతలకు కూడా సంబంధం ఉందని వైసీపీ నేతలు వాదించగా, ఇది వైసీపీ నేతలకు చెందినదే అని టీడీపీ నేతలు వాదించారు. వేలకోట్లు విలువగల ఆ మాదక ద్రవ్యాలు మావి కావంటే మావి కావని, అవి మీవే నంటే మీవేనని అందరూ వాదించుకున్నారు. ఒకవేళ నిజంగా వేలకోట్ల సరుకు దానిలో ఉన్నట్లయితే ఈవిదంగా వాదించుకునేవారా.. వదిలేసుకునేవారా? అంటే కాదనే చెప్పొచ్చు.

మొత్తం మీద ఆ పేరుతో మూడు పార్టీలు జోరుగా రాజకీయాలు చేసుకొని దేనికవి ఎంతో కొంత మైలేజ్ తీసుకున్నాయి. ఇప్పుడు తాపీగా వాటిలో డ్రైడ్ ఈస్ట్ మాత్రమే ఉందని సీబీఐ చెప్పింది. మరైతే ఆనాడు దానిలో మాదక ద్రవ్యాలో లేదా వాటి అవశేషాలో ఉన్నాయని నివేదిక ఎందుకు ఇచ్చిన్నట్లు? అనేది జవాబు దొరకని భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories