ధియేటర్లలో బొమ్మ పడకముందే వెబ్ మీడియాలో సినిమాలు ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరి సినిమా విడుదలైన తర్వాత పైరసీ ఎన్ని గంటలలో వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఫస్ట్ షో పడిన వెంటనే ఆన్ లైన్ లో సినిమాలు పైరసీ రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇందుకు “దువ్వాడ జగన్నాధమ్” ఏం మినహాయింపు కాదని ఆన్ లైన్ లో సర్క్యూలేట్ అవుతోన్న లింక్స్ చెప్పకనే చెప్తున్నాయి.
తొలి రోజునే విడుదలైన “డీజే” పైరేటెడ్ కాపీలను నియత్రించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పలు ట్వీట్స్ చేస్తూ అభిమానులను ప్రోత్సహిస్తోంది. దీంతో సదరు వెబ్ సైట్స్ కు సంబంధించిన లింక్స్ ను దర్శకనిర్మాతలకు పంపిస్తూ… ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రత్యేకించి మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు హరీష్ శంకర్.
పైరేటెడ్ లింక్స్ ను మా దృష్టికి తీసుకురావడంలో సహకరించిన మహేష్ బాబు, తారక్ అభిమానులకు థాంక్స్ చెప్తూ హరీష్ తాజాగా ట్వీట్ చేసారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఎందుకు ప్రస్తావించలేదు. పొరపాటున మరిచిపోయారా? లేక పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో సహకారం అందించలేదా? అదీ కాక మెగా ఫ్యాన్స్ లోనే పవన్ ఫ్యాన్స్ ఉన్నారన్న లాజిక్ ను హరీష్ శంకర్ వాడతారా?
సినిమా విడుదలైన నాటి నుండి సోషల్ మీడియాలో “డీజే” పట్ల నెగటివ్ టాక్ వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇందులో పవన్ అభిమానులు ముందున్నారన్న విషయం బహిరంగమే. అయితే సినిమా కూడా అలాగే ఉండడంతో, వారికి మరింత ప్రోత్సాహం లభించినట్లయ్యింది. బహుశా ఈ సంఘటనలతో దర్శకుడు హరీష్ శంకర్ హార్ట్ అయ్యారా? అందుకే పవన్ ఫ్యాన్స్ ని విస్మరించారా? బహుశా ‘థ్యాంక్యూ మీట్’లో ఏమైనా సంచలన ప్రకటనలు చేస్తారేమో చూడాలి.



