ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న “దువ్వాడ జగన్నాధమ్” ధియేటర్లో ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఖలీల్ థియేటర్లో సోమవారం సాయంత్రం చెలరేగిన అలజడి, చివరికి కత్తి పెట్టి దాడి చేసే వరకు వెళ్ళింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘డీజే’ సినిమాకు ఓ పది మంది యువకులు మద్యం సేవించి రావడమే ఈ బీభత్సానికి కారణంగా తెలుస్తోంది.
సదరు యువకులు బాగా తాగి అల్లరి చేస్తూ, విజిల్స్ వేస్తూ థియేటర్లోని ఇతర ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో, అలా చేయకూడదని పలువురు నచ్చచెప్పగా, వారిపై సదరు యువకులు దాడికి దిగారు. థియేటర్ నిండుగా ప్రేక్షకులు ఉండటంతో అందరూ అభ్యంతరం తెలిపారు. మద్యం మత్తులో ఎవరి మాటా వినని ఆ యువకులు రెచ్చిపోతూ కొంతమంది ప్రేక్షకులపై చేయి చేసుకున్నారు.
ఆ క్రమంలో వడ్డె సుబ్బరాయుడు అనే మరో వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో అల్లరి చేస్తున్న యువకులపై దాడి చేశాడు. దీంతో రెహమాన్, రహిమాన్, షేక్ నమీర్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వినోదం కోసమని రంజాన్ పండగ రోజు ధియేటర్ కు వెళితే, చివరికి అది విషాదంగా మిగలడం విశేషం.



