రేషన్ బియ్యం దొంగలు గప్‌చిప్?

Dwarampudi Chandrasekhara Reddy Jagan Ration Rice Scam

కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్ళుగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్న విషయం బయటపడి అప్పుడే వారం రోజులు కావస్తోంది. నిజానికి 2-3 నెలల క్రితమే మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం బయటపెట్టారు. కానీ ఇంత వరకు రేషన్ బియ్యం దొంగలు ఎవరూ మాట్లాడటం లేదు. ఖండించడం లేదు.

ADVERTISEMENT

ఎందువల్ల అంటే, రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా గురించి మాట్లాడితే ఆ దొంగతనం గురించి మరిన్ని వార్తలు వస్తాయి. మరింత లోతుగా చర్చలు సాగుతాయి. కనుక ఆ దొంగతనం గురించి మాట్లాడితే స్వయంగా చాటింపు వేసుకున్నట్లవుతుంది. కనుక జగన్‌, ద్వారంపూడి చంద్రశేఖర్, వైసీపీ నేతలు ఎవరూ కూడా ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదనుకోవచ్చు.

కానీ కాకినాడ పోర్టులో వాటాల అమ్మకం గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆ వ్యాపార లావాదేవీల వ్యవహారం సామాన్య ప్రజలు అర్దం చేసుకోవడం కష్టం. కనుక సొంత మీడియాలో దానినే హైలైట్ చేస్తూ అదంతా చాలా సవ్యంగా, పారదర్శకంగానే జరిగిందని, కానీ చంద్రబాబు నాయుడే దూరాశతో ఈ డ్రామా నడిపిస్తున్నారని కధనాలు వండి వార్చేస్తూ కనీసం 40 శాతం ప్రజలను నమ్మించినా చాలనుకోవడం వల్లనే.

పుంఖాను పుంఖాలుగా ప్రచురించే ఆ కధనాలు చదివే ఓపిక, ఆసక్తి సామాన్య ప్రజలు ఎవరికీ ఉండదు. కనుక తాము కడిగిన ఆణిముత్యాలమని 40 శాతం ప్రజలను నమ్మించగలిగినా చాలు.

అయితే కాకినాడ పోర్టు, సెజ్‌లో వాటాలు 2020 లోనే అంటే జగన్‌ అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరమే వైసీపీ నేతలకు చెందిన అరబిందో చేతికి వచ్చేయనేది వాస్తవమని వైసీపీ సొంత మీడియా తేల్చి చెప్పేసింది.

ఇక దాని ప్రశ్నల విషయానికి వస్తే, రూ.2,500 కోట్లు విలువైన వాటాలను కేవలం రూ.494 కోట్లకే అరబిందో సంస్థకు ఎందుకు అమ్మేసింది? కాకినాడ సీపోర్టులో మంచి లాభాలలో నడుస్తున్నప్పుడు వాటాలు అమ్మాల్సిన అవసరం ఏమిటి?అంటే వైసీపీ బెదిరింపులే అని అర్దమవుతోంది.

బెదిరించిన్నట్లయితే రూ.494 కోట్లు చెల్లించడం దేనికి?ఉచితంగానే తీసేసుకోవచ్చు కదా?అనే ప్రశ్న అతి తెలివి ప్రదర్శించడమే.

అన్ని వేల కోట్లు విలువగల వాటాలను ఉచితంగా తీసుకోవడానికి అవేమీ పోర్టు దగ్గర అమ్మే శనగకాయలో, పుల్లట్లో కావు.

తప్పనిసరిగా ఎంతో కొంత ముట్టజెప్పి ఒప్పందం చేసుకోకపోతే ఆ లావాదేవీ రిజిస్టర్ చేయబడదు. కనుకనే ఆ మాత్రం అయినా ముట్టజెప్పింది. లేకుంటే నిజంగానే ఫ్రీగానే తీసేసుకొని ఉండేది.

పోర్టులో వాటాల కధలను ప్రభుత్వం, సంబందిత వ్యవస్థలు ఎలాగూ తేలుస్తాయి. కానీ గత 5 ఏళ్ళుగా పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎవరు ఎగుమతి చేశారో.. ఎవరెవరు లబ్ధి పొందారో.. పౌరసరఫరాల శాఖ నుంచి సుమారు కోటి టన్నుల రేషన్ బియ్యం ఏవిదంగా పక్కదారి పట్టించారో.. ఎవరెవరి ప్రమేయం ఉందో వైసీపీ నేతలు లేదా వారి సొంత మీడియా చెప్పగలరా?

ADVERTISEMENT
Latest Stories