కేసీఆర్ కు సీరియల్ కష్టాలు…!

KCR

నిన్న మొన్నటి దాకా తెరాస తో తెలంగాణ రాజకీయాలలో, బిఆర్ఎస్ తో దేశ రాజకీయాలో చక్రం తిప్పిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అధికారం కోల్పోయిన నాటి నుంచి సీరియల్ కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి.

ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూమ్ లో కాలుజారి పడి కాలుకి శస్త్ర చికిత్స చేపించుకుని కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగానే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా గులాబీ కండువా మార్చే పనిలో బిజీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్యం కొంచెం కుదుట పడగానే ఇటు కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలుకు వెళ్ళింది.

ADVERTISEMENT

అలాగే కేటీఆర్ పైన కూడా ఫోన్ టాపింగ్ ఆరోపణలు రావడంతో ఇక మౌన ముద్ర నుంచి బయటకు వచ్చి పార్టీని, పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దచేసే పనిలో పడ్డ కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్ల సభలో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు పై ఈసీ చర్యలకు ఉపక్రమించింది.

ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని, ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూ లలో పాల్గొనకూడదు అంటూ నిషేధం విధించింది. అయితే ఈసీ చర్యల పై స్పందించిన కేసీఆర్ నా మాటలను స్థానిక మాండలికాన్ని అధికారులు సరిగ్గా అర్ధం చేసుకోలేదు. వాటిని వక్రీకరించి కాంగ్రెస్ నేతలు నా పై ఫిర్యాదు చేసారంటూ వ్యాఖ్యానించారు.

అలాగే కేటీఆర్ కూడా కేసీఆర్ ప్రచారం పై ఈసీ విధించిన 48 గంటల నిషేధాన్ని ఖండిస్తూ, ఇదెక్కడి అరాచకం..? తెలంగాణ గొంతు అయినా కేసీఆర్ పైన నిషేధమా..? మోడీ చేసిన విద్వేష వ్యాఖ్యలు ఈసీ కి వినిపించలేదా..? అలాగే రేవంత్ మాట్లాడుతున్న బూతులు కనిపించలేదా..? అంటూ తన X లో స్పందించారు. ఇలా కేసీఆర్ కు ఒకదాని తరువాత మరొకటి సీరియల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories