సినీ నటుడు శివాజీ కావచ్చు, నిర్మాత నాగ వంశీ కావచ్చు లేదా మరెవరో కావచ్చు. బహిరంగ వేదికలపై నోరు జారి విమర్శల పాలవుతుంటారు. చివరికి కనిపించని ఆ అదృశ్య శక్తులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పుకొని వివాదం నుంచి బయటపడుతుంటారు.
అయితే మీడియా, సినీ పరిశ్రమలోని ఆ అదృశ్య శక్తులు వారి జీవితాల్లో వేలు పెట్టడాన్ని మాత్రం తప్పుగా భావించవు. అకారణ ద్వేషంతో సినిమాలను దెబ్బతీయడాన్ని కూడా తప్పు అనుకోవు. వారు నష్టపోయి బాధపడుతున్నప్పుడు పైశాచిక ఆనందం కూడా అనుభవిస్తుంటారు.
అంతేకాదు… నటీనటులు లేదా దర్శక నిర్మాతలు వారిని తప్పుపడుతూ మాట్లాడితే, వారి అహం మరింత దెబ్బ తింటుంది. వెంటనే మరోసారి దెబ్బ కొట్టేందుకు కాచుకుని కూర్చుంటారు.
కానీ సినీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తూ దానినే దెబ్బ తీయాలనుకోవడం తింటున్న కంచంలోనే ఉమ్ముకోవడమే అని సంగీత దర్శకుడు తమన్ అన్న మాటలు అక్షరాల వాస్తవం.
మహిళల డ్రెస్ సెన్స్ గురించి నోరు జారినందుకు శివాజీ క్షమాపణలు చెప్పుకున్న తర్వాత మరో కార్యక్రమంలో ఈ అంశం వచ్చింది.
మొన్న తాను తప్పుగా మాట్లాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారే తప్ప ఎవరూ వారించలేదని ఆయన చెప్పారు.
మీడియా మిత్రులంతా తన ఎదుటే ఉన్నారని, అప్పుడే ఎవరో ఒకరు హెచ్చరించి ఉంటే తాను సరిచేసుకునేవాడినని శివాజీ అన్నారు. అప్పుడు ఇది ఇంత దూరం వచ్చి ఉండేది కాదని అక్కడితోనే ఆగిపోయేదని అన్నారు.
అయితే శివాజీ అయినా, రాజేంద్ర ప్రసాద్ లేదా మరొక ప్రముఖులు ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలో తెలియని చిన్నపిల్లలు కారు. లోకం తెలియని వ్యక్తులు కూడా కారు. కనుక వేదికపై మైమరిచి మాట్లాడితే తమ కోసం కొన్ని గ్యాంగులు సిద్ధంగా ఉంటాయనే విషయాన్ని కూడా తప్పక గుర్తుంచుకోవాల్సిందే. ఆచితూచి మాట్లాడటం అలవరచుకోవలసిందే! దొరికిపోయాక ఇలా బాధపడి ప్రయోజనం ఉండదు.






