
నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు యావత్ దేశంలో అల్లు అర్జున్ అరెస్ట్ వార్తలే ప్రధానంగా వచ్చాయి. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్నారు కనుక క్రమేపీ ఈ వేడి చల్లారుతుంది.
పుష్పరాజ్ సినిమాలో దుర్మార్గుడే కానీ నిజ జీవితంలో చాలా మంచివాడు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఏపీలో పుష్పరాజ్లు రాజకీయాలలో నీతి నిజాయితీ, న్యాయం ధర్మం అంటూ అందరికీ సుద్దులు చెపుతూ, నిజజీవితంలో అచ్చం సినిమా పుష్పరాజ్లా రాష్ట్రాన్ని లూటీ చేసేశారు.
Also Read – ఉచితం సముచితం కాదు కానీ తప్పదుగా!
ఒకరు భూములు కబ్జా చేసే పుష్పరాజ్ కాగా, మరొకరు గోదాములలో నుంచి బియ్యం మాయం చేసే పుష్పరాజ్, ఆ బియ్యాన్ని దర్జాగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసే పుష్పరాజ్ మరొకరు.. ఏపీలో ఇలాంటి పుష్పరాజ్లు చాలా మందే ఉన్నారు. వారందరినీ పట్టుకొని శిక్షలు పడేలా చేయడానికి కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్ళు కూడా సరిపోవేమో?
మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మచిలీపట్నంలో ఆయన భార్య జయసుధ పేరిట గల గోదాములలో నుంచి పౌరసరఫరాల శాఖకు చెందిన 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైపోయింది.
Also Read – వైసీపీ నేతలందరూ ఇలా ప్రత్యక్షమయ్యారేమిటి?
కనుక పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కోర్టు ఆయన పిటిషన్ని స్వీకరించినప్పటికీ సాంకేతిక కారణాల వలన విచారణ ఈ నెల 16కి వాయిదా పడింది. కనుక అరెస్ట్ భయంతో పేర్ని నాని కుటుంబంతో సహా జంప్ అయిపోయారు. రైతుల సమస్యలపై వైసీపీ శ్రేణులు పోరాడాలని జగన్ పిలుపు ఇచ్చినప్పుడే బియ్యం పుష్పరాజ్ స్టోరీ క్లైమాక్స్ చేరుకోవడం, వెంటనే ఆయన జంప్ అయిపోవడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ వైసీపీకి ఇది సిగ్గుచేటు.
గోదాములలో నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం ఎలా మాయం అయ్యిందనే ప్రశ్నకు పేర్ని నాని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చెపితే ఆ బియ్యం ఎక్కడికి చేరుకున్నాయో బయటపడుతుంది.
Also Read – నందిగం సురేష్ బయట కంటే లోపలే హ్యాపీ?
ఒకవేళ నాని గోదాముల నుంచి కాకినాడ పోర్టుకి చేరుకున్నట్లయితే, పేర్ని నానికి ఆ కేసు కూడా బోనస్గా లభిస్తుంది. ఇంకా లోతుగా విచారణ చేయగలిగితే రాష్ట్రంలో ఇంకా ఎన్ని గోదాముల నుంచి ఎంత బియ్యం మాయం అయ్యాయి? ఎవరెవరి హస్తం ఉందనే విషయం బయటపడుతుంది.
కనుక ఈ పుష్పరాజ్లను కనిపెట్టి పట్టుకోవడం, ఆ తర్వాత కేసులు నమోదు చేసి విచారణ చేయబోతే ఇలా మాయం అయిపోతుంటే వారిని మళ్ళీ వెతికి పట్టుకోవడానికే కూటమి ప్రభుత్వం పుణ్యకాలం సరిపోతుందేమో?మరి గంగమ్మ జాతర జరిగేదెప్పుడు… వారందరికీ ఎప్పుడు శిక్షలు పడేదెప్పుడు?అంటే సమాధానం ఎవరూ చెప్పలేరు.