తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు మూడేళ్ళుగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కేసీఆర్ ఎంతవరకు వెళ్ళారంటే, మోడీ ప్రధాని పదవికి అనర్హులు. ఆయనకు దేశాన్ని పాలించడం చాతకాదు. ఆయనని నేనే గద్దె దించి ఇంటికి పంపిస్తా. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తా…” అనే వరకు!
కానీ మోడీని ఆయన ఓడించడం కాదు… ఆయనే శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి ఇంట్లో కూర్చొన్నారిప్పుడు. బీజేపీ జోరు చూసి భయపడి ఆయన మోడీపై కత్తులు దూస్తే, అనూహ్యంగా కాంగ్రెస్ ఆయనను గద్దె దించి ఇంట్లో కూర్చోపెట్టింది!
దీంతో ఆయన వెంటనే తన శత్రువుని మార్చేసుకొన్నారు! కాంగ్రెస్ పార్టీని శత్రువుగా ప్రకటించేసి ఇప్పుడు బీజేపీకి, ప్రధాని నరేంద్రమోడీకి దగ్గరయ్యేందుకు కొడుకు,కూతురు ద్వారా సిగ్నల్స్ పంపిస్తున్నారు.
ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు మావైపే ఉన్నారని కేటీఆర్ శాసనసభలో చెప్పగా, ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత సనాతనధర్మానికి, హిందువులకి కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ బీజేపీ కోణంలో మాట్లాడారు. మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకొనేందుకే కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిపై కూడా ఆమె చేత కేసీఆర్ నాలుగు విమర్శలు చేయించినట్లున్నారు.
లోక్సభ ఎన్నికలలో మళ్ళీ బీజేపీ గెలుస్తుందని, మళ్ళీ నరేంద్రమోడీయే ప్రధానిగా బాధ్యతలు చేపడతారని సర్వేలు సూచిస్తుండటంతో, లోక్సభ ఎన్నికలలోనే బీజేపీతో చేతులు కలిపేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఇంతకాలం ప్రధాని నరేంద్రమోడీని ఇన్ని తిట్లు తిట్టి, ఆయన హైదరాబాద్ వస్తే మొహం చాటేయడమే కాకుండా ఆయనను నిలదీస్తూ పోస్టర్స్ కూడా వేయించిన కేసీఆర్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీ దగ్గరకు వెళతారు?ఒకవేళ మోడీతో దోస్తీ కుదిరినా ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందుకు వెళతారు?వారికి కొత్తగా ఏం కధ అల్లి చెపుతారో?




