రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సరిగా పని చేయడం లేదని, ముఖ్యంగా ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోందని, ఒకరిద్దరు ఎంపీలు తప్ప మిగతా వారు అసలు పార్లమెంట్ లో తమ సమస్యలను ఎత్తి చూపించడం లేదంటూ గతంలో చేసిన వ్యాఖ్యలతో పాటు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తప్పుపట్టారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తావు లేదని, పవన్ ను స్వయంగా కలిసి ఏపీ అభివృద్ధి ఎలా జరుగుతుందో, దానికి మేము ఎలా తోడ్పడుతున్నామో చెప్తామని, అలాగే ఎంతలా కష్టపడుతున్నామో వివరిస్తామని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీతో కలిసుంటామో లేదో తాను ఇప్పుడే చెప్పలేనని, అయితే అప్పటివరకూ ఆ పార్టీతో కలిసి నడుస్తామని, కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే ఇప్పటికీ నమ్ముతున్నామని కేంద్రం నుంచి విడతల వారీగా నిధులు అందుతూనే ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసారు.



