నేటి జగన్ ప్రెస్ మీట్ తో వైసీపీ శ్రేణులతో పాటుగా రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ 2029 ఎన్నికల నినాదం పై ఒక స్పష్టత వచ్చేసింది. 2029 ఎన్నికలు అమరావతి vs మావిగన్ మధ్య జరుగుతాయని, అమరావతికి మద్దతు తెలిపే వారు కూటమికి ఓటేస్తారని, మావిగన్ కు ఓటేసేవారు వైసీపీ వెంట నడుస్తారని జగన్ ప్రకటించేసారు.
అయితే ఈ నేపథ్యంలో మరి జగన్ గతంలో ప్రకటించిన మూడు రాజధానుల మాటేంటి.? విశాఖే రాజధాని అంటూ జగన్ చెప్పిన చిలకపలుకల సంగతేంటి.? అంటే జగన్ నుంచి సమాధానం కరువయ్యింది. విశాఖే రాజధాని అంటూ అందుకు బలం చేకూరేలా రుషికొండ ప్యాలస్ నిర్మించిన జగన్ నేడు అదే విశాఖ గురించి ప్రశ్న రాగానే రెండు చేతులు జేబులో పెట్టుకోకుండానే జారుకున్నారు.
ఇక గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతిని స్మశానం అని, వరద ప్రాంతమని అమరావతిని సమాధి చేసిన జగన్ తాజా మావిగన్ ప్రకటనతో విశాఖను ఆర్కే బీచ్ లో కలిపేశారా.? 2029 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో లో మావిగన్ ను జోడిస్తామని చెపుతున్న జగన్ విశాఖ రాజధాని అనే అంశాన్ని ముగిసిన అధ్యాయంగా ప్రకటించగలరా.?
మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో వైకుంఠపాళి ఆడిన జగన్ ఆ తరువాత విశాఖకు షిఫ్ట్ అయ్యారు. దీనితో ఇటు అమరావతి ప్రాంతమైన కృష్ణ, గుంటూరు జిల్లాలో వైసీపీ ని రాజకీయ సమాధి చేయడంతో పాటుగా అటు విశాఖ, కడప జిల్లాలలో కూడా వైసీపీ ని పాతాళానికి నెట్టారు.
ఇలా ప్రతి ఎన్నికకొక రాజధాని పేరు చెప్పుకుంటూ వెళుతున్న జగన్ మావిగన్ తో కనీసం వైసీపీ మద్దతుదారులనైనా సంతృప్తి పరచగలరా.? మాట తప్పం మడం తిప్పం అంటూ ప్రచారం చేసుకునే జగన్ ఒక్క రాజధాని విషయంలోనే ఇప్పటికి ఎన్ని మాటలు మార్చారో ఎన్నిసార్లు మడాలు తిప్పారో చెప్పగలరా.?




