ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రమాణస్వీకారానికి చంద్రబాబు నాయుడును పిలవడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు అందరూ. అయితే ఆ కార్యక్రమం పూర్తి కాగానే పరిస్థితులు మాములు స్థితికి చేరిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి రాకపోవడంతో ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు ఒక బృందాన్ని ఒక అభినందన లేఖతో జగన్ వద్దకు పంపించారు. అయితే ఆ బృందానికి జగన్ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు.
ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గంటా శ్రీనివాసరావు తాము జగన్మోహన్రెడ్డికి టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలిపేందుకు రెండు రోజులపాటు ప్రయత్నించినా అవకాశం లభించలేదని చెప్పారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని, ప్రతిపక్షంతో పాటు మీడియానూ బెదిరిస్తున్నట్లుగా మాట్లాడారని గంటా అన్నారు. ఎన్నికల వేళ నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల నుంచి అప్పుడే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అలాగే “టెండర్ల రద్దు విషయంలో గత ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దిల్లీలో మోదీని కలిశాక ప్రత్యేక హోదాపై స్పష్టంగా మాట్లాడలేక జగన్ డొంకతిరుగుడుగా వ్యవహరించారు. వృద్ధుల పింఛన్లు రూ.3వేలకు పెంచుతామని చెప్పి.. కేవలం రూ.250 పెంచి రూ.2,250కి పరిమితం చేశారు. మద్యపాన నిషేధం విషయంలోనూ మాట దాటవేస్తూ దశలవారీగా అమలుచేసి ఆఖరుగా హోటళ్లలో విక్రయిస్తామని అంటున్నారు,” అని గంటా వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా టీడీపీ తరపున జగన్ ను విమర్శించిన మొట్టమొదటి ఎమ్మెల్యే గంటా కావడం విశేషం.



