కుల రాజకీయాలను ప్రోత్సహించి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై అధికార పార్టీ వర్గాలు చాలా సందర్భాలలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం ఇచ్చిన కాపు ఉద్యమ పిలుపులో అరాచకం సృష్టించింది జగన్ వర్గీయులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. ఎలాగైనా ఏపీలో కుల చిచ్చు రేపి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏదొక రూపేణా ఇబ్బందులకు గురిచేయాలనేది జగన్ సంకల్పంగా రాష్ట్ర రాజకీయాలలో బలపడిన అంశం.
ప్రస్తుతం వైసీపీ కేంద్రంగా జరుగుతున్న విషయంలో కూడా అంతర్లీనంగా ఇదే స్కెచ్ ఉండి ఉండవచ్చన్న భావాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైసీపీ నేత గౌతంరెడ్డి కాపు సామాజిక వర్గానికి నాయకులైన వంగవీటి రంగా మరియు రాధాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రంగా వర్గం భగ్గుమనడంతో, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు జగన్. అయితే ఇదంతా వైసీపీ అధినేత కనుసన్నల్లో జరిగిన “పొలిటికల్ గేమ్”గా కనపడుతోందన్నది విశ్లేషకుల వాదన.
నంద్యాల మరియు కాకినాడ ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూసిన జగన్, ఏపీలో ఎక్కువ శాతం ఓటు బ్యాంక్ కలిగిన కాపు సామాజిక వర్గం తమ వైపు లేదన్న విషయం తేటతెల్లమైంది. ముద్రగడ ద్వారా వేసిన పాచిక పారకపోగా, అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తమకే ‘బూమ్ రాంగ్’ అయ్యే పరిస్థితి నెలకొంటుండడంతో, ఎలాగైనా కాపులకు అండగా తాము ఉంటామని తెలియజెప్పేందుకు… వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ వాతావరణాన్ని సృష్టించి ఉంటారనేది విజయవాడ టాక్.
లేదంటే తమ పార్టీ నేతలోనే ఉన్న వంగవీటి రాధా తండ్రి రంగా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ‘వంగవీటి’కి వైరంగా ఉన్న ‘దేవినేని’ వర్గీయులు కూడా గౌతం రెడ్డి చేసినంతగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పడంలో సందేహం లేదు. దీంతో ఇదేదో ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉదంతంలా కనపడుతోంది తప్ప, గౌతంరెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలులా లేవు. ‘కాపు’ వర్గానికి సంబంధించిన రంగా కోసం, తన సొంత సామాజిక వర్గానికి చెందిన ‘రెడ్డి’ని సైతం పక్కన పెట్టాడన్న నినాదం కాపు వర్గాలకు చేరువ కావాలని, తద్వారా సదరు ఓటు బ్యాంకు మొత్తం తన వైపుకు రావాలనేది జగన్ అసలు భావనగా పొలిటికల్ టాక్.


