యుద్ధానికి ముందు జగన్‌ సైన్యంలో ఈ అలజడి ఏమిటి?

YS Jagan Grama Volunteer

“జరగబోయేది కురుక్షేత్ర మహా సంగ్రామమే…” అని జగన్మోహన్‌ రెడ్డి పదేపదే చెప్తున్నారు. అటువంటి మహాసంగ్రామానికి బయటలుదేరేటప్పుడు సైన్యాధ్యక్షుడికి తన సైన్యంపై పూర్తి నమ్మకం ఉండాలి. అలాగే సేనాధిపతులు, సైనికులకు కూడా తమ సైన్యాధ్యక్షుడిపై పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే యుద్ధంలో గెలిచే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

కానీ ఇంతకాలం ముసిముసి నవ్వులు నవ్వుతూ హాయిగా గడిపేసిన జగన్‌, ప్రతిపక్షాలను తిట్టిన తిట్టు తిట్టకుండా కాలక్షేపం చేసేసిన ఆయన సైన్యం యుద్ధం సమీపిస్తుంటే తడబడుతున్నారు. ఈ సైన్యాన్ని వెంటబెట్టుకొని యుద్ధానికి వెళితే ఓడిపోతామనే భయంతో జగన్‌ వారిని మార్చేస్తుంటే, ఆయననే గుడ్డిగా నమ్ముకొన్న తమ పరిస్థితి ఏమిటని వైసీపి ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

జగన్‌ సైన్యంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు కూడా యుద్ధానికి ముందు జీతాలు పెంచాలంటూ సమ్మెకి సిద్దమవుతున్నారు. వారికి నెలకు రూ.5,000 చెల్లిస్తుండగా ఇటీవలే నెలకు రూ.750 చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వైసీపి తమచేత చేయించుకొంటున్న వెట్టిచాకిరీకి అది ఏమాత్రం సరిపోదని, కనీసం నెలకు రూ.10-12 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నెల 23 నుంచి తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, పార్వతీపురం మన్యం జిల్లాలలో పలు ప్రాంతాలలో వాలంటీర్లు సమ్మె మొదలుపెట్టగా, మిగిలిన జిల్లాలలో వాలంటీర్లు ‘ఆడుదాం ఆంద్రా’ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు.

అయితే జగన్మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేలను కూడా మార్చేస్తుండటంతో వాలంటీర్లను బుజ్జగించేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. కొందరు సీనియర్ నేతలు మాత్రం ఇప్పటికిప్పుడు జీతాలు పెంచే పరిస్థితి లేదు కనుక ఎన్నికలలో వైసీపి గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే తప్పకుండా జీతాలు పెంచుతామని వాలంటీర్లకు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కానీ 4 ఏళ్లుగా ఎదుగూబొదుగూ లేని జీతాలు, జీవితాలతో నలిగిపోతున్న వాలంటీర్లు ససేమిరా అంటున్నారు. నేటి నుంచి మరికొన్ని జిల్లాలలో వాలంటీర్లు సమ్మెలో దిగబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి ఎన్నికలలో 175 సీట్లు మనమే గెలుచుకోబోతున్నామని ఇంతకాలం గొప్పగా చెప్పుకొన్న జగన్‌, యుద్ధానికి ముందు సొంత శిబిరంలోనే నిప్పు పెట్టుకొని వాటిని ఆర్పుకొనే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరంగా ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories