బుదవారం భీమవరంలో జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మినారాయణ హాజరు కాకపోవడంతో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు ధృవీకరించిన్నట్లయింది. ఆయనతో పాటు మరికొందరు బిజెపి నేతలు, కార్యకర్తలు కూడా జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ, “పవన్ కళ్యాణ్ మా పార్టీతో పొత్తులు కొనసాగించాలనుకొంటున్నారో లేదో ఆయన ఇష్టం. వద్దనుకొంటే బలవంతం ఏమీ లేదు. కానీ మా పార్టీతో పొత్తులు కొనసాగిస్తూ మా పార్టీకి నష్టం కలిగించాలని చూస్తే సహించబోము. బిజెపితో కలిసి సాగాలనుకొంటే పవన్ కళ్యాణ్ మిత్రధర్మం పాటించడం అవసరం,” అని సున్నితంగా హెచ్చరించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు మాట్లాడుతూ, “బిజెపి, జనసేనల మద్య నేటికీ పొత్తులున్నాయి. ఇక ముందు కూడా అవి కొనసాగుతాయనే భావిస్తున్నాను. ఆయన రాజకీయ పర్యటనలు, ఇతర పార్టీల నేతలనీ కలవడాన్ని మేము తప్పపట్టడం లేదు. ఎవరి ఆలోచనలు… ఎవరి పర్యటనలు వారివి. అంతమాత్రన్న రెండు పార్టీలు దూరం అయ్యాయని చెప్పడం సరికాదు. పవన్ కళ్యాణ్కి, ఆయన పర్యటనలకి, జనసేన పార్టీ కార్యక్రమాలకి బిజెపి సంఘీభావం తెలుపుతోంది. పవన్ కళ్యాణ్ కంటే మా నాయకుడు ప్రధాని నరేంద్రమోడీయే గొప్ప హీరో అని మేము భావిస్తున్నాము,” అని అన్నారు.
టిడిపితో పొత్తులు అవసరం లేదని బిజెపి చాలా స్పష్టంగా చెపుతోంది. కానీ రాబోయే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తుకి సిద్దం అవుతున్నారు. అయితే ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నందున ఇప్పుడే టిడిపితో పొత్తు గురించి మాట్లాడటం తొందరపాటే అవుతుందని భావిస్తున్నారు. కనుక బిజెపితో కొనసాగుతున్నారు. అయితే బిజెపికి మిత్రపక్షంగా ఉంటూ బిజెపి నేతలని జనసేనలో చేర్చుకోవడం సరికాదు. ఒకవేళ చేర్చుకొంటే అప్పుడు బిజెపియే జనసేనతో తెగతెంపులు చేసుకోవడం ఖాయం.



