సువిశాలమైన సముద్ర తీరం కలిగిన ఆంధ్రాలో వర్షాలు పడకపోవచ్చేమో కానీ ఏటా తెలంగాణలో భారీ వర్షాలు పడుతూ రాష్ట్రంలో వరదలు వస్తూనే ఉంటాయి. వాటిలో హైదరాబాద్తో సహా అనేక ఊళ్ళు నీట మునుగుతూనే ఉంటాయి.
భద్రాచలంలో ఏటా గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూనే ఉంటారు. ఊళ్ళోకి నీళ్ళు వస్తూనే ఉంటాయి. తెలంగాణని ముంచెత్తిన ఆ నీరంతా దిగువన ఆంధ్రా మీదుగా బంగాళాఖాతంలో కలుస్తూనే ఉంటుంది.
అందుకే గోదావరి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని దిగువనున్న ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు.
ఆ నీటినే వాడుకోలేకపోతున్నప్పుడు మళ్ళీ హరీష్ రావు వంటి బీఆర్ఎస్ నేతలు, ఆంధ్రాలో కడుతున్న ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడుతుంటారో?ఆ పేరుతో ఎలా రాజకీయాలు చేస్తుంటారో అందరికీ తెలుసు.
పట్టిసీమతో చంద్రబాబు నాయుడు వరద నీటిని చక్కగా ఉపయోగించుకుంటున్నారని మెచ్చుకొంటూనే, ఆ నీళ్ళు కిందకి వదలబట్టే కదా?అంటూ ఓ సన్నాయినొక్కు కూడా నొక్కుతుంటారు.
తాజాగా హరీష్ రావు మళ్ళీ ఆంధ్రా పాట పాడారు. ఈ నెల 18న జరుగబోయే గోదావరి బోర్డు యాజమాన్యం సమావేశంలో తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని, అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని హరీష్ రావు ఆరోపించారు.
గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నా అభ్యంతరం లేదని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తుంటే, తెలంగాణకు తాగు, సాగు నీరు లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని హరీష్ రావు ఆరోపించడం రాజకీయమే కదా?
పదేపదే ఆంధ్రా, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నీళ్ళ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తూ ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ఆశ పడుతున్నట్లు భావించవచ్చు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని కొట్టాలంటే సొంత రాజకీయ బలంతో కొట్టాలి కానీ దానికీ చంద్రబాబు నాయుడు పేరు వాడుకోవాలా?
తెలంగాణకు దిగువన ఉన్న ఆంధ్రా పాలకులు, పార్టీలు, ప్రజలు నీటి గురించి ఆందోళన చెందితే అర్థం ఉంటుంది. కానీ ఎగువనున్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతున్నట్లు నటిస్తుండటమే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా?




