ఫోర్జరీతో పాటు, నిధుల మళ్లింపుకు పాల్పడి టీవీ9 టీవీ ఛానల్ నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనతో పాటు నటుడు శివాజీ కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు. శివాజీ కూడా పోలీసుల విచారణకు సహకరించడం లేదు. వీరిద్దరి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు శివాజీకి, రవి ప్రకాష్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? రవి ప్రకాష్ ను వ్యతిరేకించే వారు శివాజీ ఆయనకు బినామీ అంటూ ఉంటారు..
కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన రవి ప్రకాష్ సిటీ కేబుల్ నుండి జెమినీ టీవీకి వచ్చారు. అప్పట్లో ఆయన చేసిన ఎన్ కౌంటరు అనే ప్రోగ్రాం సూపర్ హిట్ అయ్యింది. దాని కోసం రవి ప్రకాష్ చాలా కష్టపడ్డారు. ఆ ప్రోగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. జెమినీ టీవీలో ఆయన పని చేస్తుండగానే అదే ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న శివాజితో పరిచయం ఏర్పడి వారు స్నేహితులుగా మారారు. అక్కడ నుండి రవి ప్రకాష్ శివాజీ గాడ్ ఫాదర్ అయ్యారు.
తాజాగా టీవీ9 నుండి తనను వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలియగానే తన స్థానంలో తనకు నమ్మకస్తుడైన శివాజీని తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేసారు ఆయన. టీవీ9 ను నిర్వహించే ఏబీసీఎల్ కంపెనీలో రవిప్రకాశ్కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని శివాజీ అంటున్నారు. దీనితో రవి ప్రకాష్ తో పాటు శివాజీ ని కూడా టార్గెట్ చేస్తున్నారు.



