దర్శకుడు కృష్ణవంశీ కెరీర్ లో కాకుండా, తెలుగు చిత్ర సీమలో “ఖడ్గం” సినిమా ఒక ప్రశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఆగష్టు 15, జనవరి 26వ తేదీలు వచ్చాయంటే ఏదొక ఛానల్ లో బుల్లితెరపై ‘ఖడ్గం’ బొమ్మ పడాల్సిందే! అంతలా ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన ‘ఖడ్గం’ తెరవెనుక గల ఓ ఆసక్తికర కధనాన్ని హీరో శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
‘ఖడ్గం’ సినిమా నటుల ఎంపిక జరుగుతున్నప్పుడు నా పేరును దర్శకుడు కృష్ణవంశీ సదరు చిత్ర నిర్మాతకు చెబితే… ఆయన అస్సలు అంగీకరించలేదట. ఆ పాత్రకు శ్రీకాంత్ సరిపోడని ఒక వైపు నిర్మాత, శ్రీకాంతే మాత్రమే కరెక్టు అని మరో వైపు దర్శకుడు కృష్ణవంశీ వాగ్వాదానికి దిగారు. శ్రీకాంత్ వద్దని నిర్మాత, నేనే కావాలని వంశీ… చాలా రోజులు చర్చలు, ఘర్షణలు చోటు చోసుకున్న తర్వాత… ‘శ్రీకాంత్ లేకపోతే నేను వేరే వాళ్లకి ఈ సినిమా చేసుకుంటాను, నువ్వు వెళ్లు’ అని నిర్మాతకు ఖరాఖండిగా కృష్ణవంశీ చెప్పేశాడు.
దీంతో అవాక్కైన నిర్మాత… ‘సర్లే, నీ ఇష్టం ప్రకారమే కానీయ్… శ్రీకాంత్ నే తీసుకుందాం’ అని నిర్మాత చెప్పాడు. ఆ విధంగా వంశీ నా కోసం పెద్ద ఫైట్ చేసి, ఆ తర్వాత నా పాత్రను మలచిన తీరు చూసిన నిర్మాత హ్యాపీగా ఫీలయ్యారు… అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఆ తరువాత షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో, తాను “పెళ్లాం చెబితే వినాలి” సినిమాకు డేట్స్ ఇచ్చేశానని, దీంతో కృష్ణవంశీకి కోపం వచ్చిందని, ‘ఇదేంట్రా ఇలా చేశావు?’ అని అడిగాడని… దానికి ‘ఉండ్రాబాబు, మంచి బ్యానర్లో సినిమా వచ్చింది. ఎలాగోలా తంటాలు పడదాం’ అని రెండు సినిమాలు కానిచ్చేశానని శ్రీకాంత్ తన ‘ఖడ్గం’ సినిమా స్మృతులను తలచుకున్నాడు.



