వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. ఈ కేసులో ఏ-2, ఏ-3, ఏ-5గా ఉన్న వై.సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిల బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు న్యాయమూర్తి జస్టిస్ ది.రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“వ్యక్తిగత స్వేచ్చ అత్యంత ప్రాధాన్యమైనదే. అయితే ఈ కేసు తీవ్రత, ముగ్గురు నిందితుల నేర చరిత్ర, వారిపై ఉన్న ఇతర కేసులు, అభియోగాలు, ఈ కేసు పూర్వాపరాలు అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని చూస్తే వారికి బెయిల్ మంజూరు చేయలేము. ఈ కేసులో జరిగిన ఇతర పరిణామాల కారణంగా బెయిల్ మంజూరు చేయాలనే వాదనలను తిరస్కరిస్తున్నాము,” అని చెప్పారు.
ఈ కేసులో వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తరపు వాదించిన సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హత్యకు సంబందించి సాక్ష్యాధారాలు తుడిచిపెట్టేసి, వైద్యులు, పోలీసులపై ఒత్తిడి తెచ్చి వివేకా మృతిని సహజమరణంగా చిత్రీకరించేందుకు ఏవిదంగా ప్రయత్నించారో వివరించారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో నిందితుడికి గల సన్నిహిత సంబంధాల గురించి కూడా ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. గతంలో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినప్పుడు నిందితుడు వైసీపీ నేతలలో ఎవరెవరిని కలిశారు.. సాక్షులను ప్రభావితం చేసేందుకు ఏవిదంగా ప్రయత్నించాడనేది కూడా కోర్టుకు వివరించారు.
సీబిఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు కూడా ఈ కేసులో ముగ్గురు నిందితులు అత్యంత రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులకు సన్నిహితులని, గతంలో వారు ముగ్గురూ సాక్షులను ఏవిదంగా బెదిరించి భయపెట్టిందీ వివరించారు. ముగ్గురూ ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలను ఏవిదంగా నాశనం చేశారో వివరించారు. ఈ కేసులో కోర్టును తప్పు దోవ పట్టించేందుకు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తికి రూ.10 కోట్లు ఆఫర్ చేసారని వివరించారు.
వారి వాదనలు, నిందితుల నేర చరిత్ర వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు వారికి బెయిల్ తిరస్కరించడం చాలా అభినందనీయమే. అయితే ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా చేసేందుకు నిందితులు, వారి వెనుక ఉన్నవారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కనుక ఆ ఉచ్చులో చిక్కుకొని వాటితోనే ఏళ్ళకు ఏళ్ళు కేసు సాగనీయకుండా వీలైనంత త్వరగా దోషులను నిర్ధారించి కటిన శిక్షలు వేసినప్పుడే న్యాయవ్యవస్థ బలం, గొప్పదనం, ఔనత్యం చాటి చెప్పినట్లవుతుంది. ఈ కేసులో నిందితుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా కోర్టు బోనులో నిలబెట్టి వారికి కూడా శిక్షలు వేయించగలిగినప్పుడే సీబీఐ గొప్పదనం తెలుస్తుంది.



