జయలలిత మృతిపై హైకోర్టుకు కూడా సందేహాలు!

How Jayalalithaa Diedఅనారోగ్యంతో బాధపడుతూ జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జరిగిన ఉపఎన్నిక సందర్భంగా పార్టీ అభ్యర్థికి జయ వేలిముద్రతో ఇచ్చిన బీఫాంపై మద్రాసు హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. బీఫాంపై ఉన్న వేలిముద్రలు నిజంగా జయలలితవేనా? అంటూ ప్రశ్నించింది. జయ మరణంపై అనుమానాలు రేకెత్తిన సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ADVERTISEMENT

జయ స్పృహలోనే ఉంటే బీఫాంపై సంతకం ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అనుమానాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి వచ్చే నెల ఆరో తేదీ లోపు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘అమ్మ’ మృతిపై తాజాగా మరోమారు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఓ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్ మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నేడు, రేపట్లో రంగంలోకి దిగే అవకాశం ఉంది. జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి స్వాగతించారు. ఆసుపత్రిలో జయకు నిర్వహించిన చికిత్స గురించి పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories