విశ్వసనీయ సమాచారం మేరకు త్వరలోనే ‘హోండా’ మోటార్ సైకిళ్లు ఆంధ్రప్రదేశ్ లోనే తయారయ్యే అవకాశాలున్నాయి. జపాన్కు చెందిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గవర్నమెంట్ తో చర్చలు జరుపుతుంది. తొందర్లోనే ఆ సంస్థతో ఎంఓయూ చేసుకోనుంది.
కర్నాటకలోని యూనిట్లో రోజుకు 6,600 మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది. ఆంధ్రాలో అంతకంటే పెద్ద యూనిట్ను ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ యోచనగా ఉంది. ఇక్కడ పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆ సంస్థ కోసం విరివిగా భూమి, మరియు వారికి కావాల్సిన రాయితీలు ఇచ్చేందుకు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది.
చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు అనుకూలమైనవిగా భావిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రాథమిక స్థాయిలో ఉంది కనుక పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే హీరో, కియా మోటార్స్ ప్రాజెక్టులు ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం వచ్చాయి. టాయోటా విద్యుత్తు కార్ల ప్లాంట్ మీద కూడా కన్నేసింది రాష్ట్ర ప్రభుత్వం.
టయోటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక అవగాహన, భాగస్వామ్యం కోసం ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇది జరగనుంది. ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విద్యుత్తు కార్లను బహుకరించనుంది. దాంతో పాటు మౌలికంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏయే అంశాల్లో కలిసి పనిచేయాలనే దానిపైన కూడా చర్చించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.





