Hydraa Effect on Vasantha Krishna Prasad

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల గురించి వింటూనే ఉన్నాము. విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ళు ఇతర కారణాల వలన గత రెండు మూడు నెలలుగా హైడ్రా జోరు కాస్త తగ్గించుకున్నప్పటికీ మళ్ళీ హటాత్తుగా విరుచుకుపడింది. అదీ.. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన నిర్మాణాలపై!

మియాపూర్ హఫీజ్ పేట సర్వే నంబర్: 79లో 39 ఎకరాల భూమిలో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన వసంత హోమ్స్ నిర్మించిన ప్రహారీగోడ, నిర్మాణ సామాగ్రి, కార్యాలయం కోసం నిర్మించుకున్న భారీ రేకుల షెడ్లని హైడ్రా కూల్చివేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నందునే కూల్చివేశామని హైడ్రా అధికారులు చెపుతున్నారు.

Also Read – వివేకా కేసులో ఇదే తీర్పు ఇచ్చి ఉంటే..

కానీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వమే దానిని ప్రభుత్వ, ప్రైవేట్ భూమిగా విభజించి ఇచ్చింది. దానికి సంబందించిన ప్రతీ డాక్యుమెంట్ మా వద్ద ఉన్నాయి. వాటన్నటినీ హైడ్రా ఛైర్మన్‌ రంగనాథ్‌కు ఇచ్చి, అవి ముట్టినట్లు సంతకాలు కూడా తీసుకున్నాము.

ఈ భూమికి సంబందించి ప్రతీ విషయమూ ఆయనకి వివరించాము. మేము సమర్పించిన పత్రాలన్నిటినీ పరిశీలించి అన్నీ సవ్యంగానే ఉన్నాయని చెప్పారు. ఏదైనా వివరణ కావాలంటే అడుగుతామని చెప్పారు.

Also Read – బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది?

కానీ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, కూల్చివేతలని అడ్డుకునేందుకు మేము కోర్టుకి వెళ్ళేందుకు కూడా అవకాశం లేకుండా కోర్టు సెలవు రోజున అన్యాయంగా కూల్చివేశారు. ఇది నా సొంత భూమి. ఎటువంటి వివాదాలు లేవు. కానీ ఆక్రమణలని కూల్చేశామని చెప్పడం చాలా అన్యాయం. మోసం. దౌర్జన్యమే. ఈ కూల్చివేత నా ప్రతిష్టకు భంగం కలిగించింది.

కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయనని కలిసి హైడ్రాపై పిర్యాదు చేస్తాను. సిఎం నాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. లేకుంటే న్యాయపోరాటం చేసి నా భూమిని నేను దక్కించుకుంటాను. ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదు,” అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అన్నారు.

Also Read – నేడో రేపో జగన్‌ అరెస్ట్‌ ఖాయమేనట!

ఇప్పటికే హైడ్రా అధికారులకు పలుమార్లు తెలంగాణ హైకోర్టులో గట్టిగానే మొట్టికాయలు పడ్డాయి. అయినా కోర్టు సెలవు రోజులలో నోటీస్ ఇవ్వకుండా కూల్చివేసినందున, అదీ.. ఓ ఎమ్మెల్యేకి చెందిన నిర్మాణాలు కావడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇది చాలా ఇబ్బందికరంగానే మారవచ్చు.




కానీ హైదరాబాద్‌లో ఆస్తులు పోగేసుకుంటున్న ఆంధ్రా నేతలందరికీ ఇదో హెచ్చరికగా కూడా చూడవచ్చు. అడ్డుగోలుగా ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించిన్నట్లే భావించవచ్చు. కానీ ఇది చివరికి ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో?