జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయాలను వ్యక్తపరిచిన మహేష్ కత్తిపై పవన్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఇదేదో ఆవేశంలో చేసిందిగా భావించినప్పటికీ, ఆ తర్వాత పక్కా ప్రణాళికా బద్ధంగా జరుగుతుందన్న విషయం తెలియడంతో, మహేష్ చట్టపరంగా ప్రొసీడ్ అయ్యారు. దీంతో మహేష్ బాధను అర్ధం చేసుకున్న వారంతా, ప్రస్తుతం మహేష్ కు మద్దతు నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది.
“ఐ సపోర్ట్ మహేష్ కత్తి” అనే నినాదంతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న చేష్టలకు వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వారితో పాటు పలువురు ప్రముఖులు కూడా మహేష్ కత్తికి మద్దతు తెలుపుతున్నారు. సామాజిక ఉద్యమకారుడు, కవి, రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవిందర్… మహేష్ కత్తికి మద్దతు పలుకుతూ… “మేం తోలు తెగకుండా గొడ్డును కోసెటోళ్లం జాగ్రత్త…! మా కోపం కట్టలు తెగనియ్యకుండ్రి…” అని పవన్ అభిమానులను హెచ్చరించారు.
అలాగే ప్రముఖ విరసం కార్యదర్శి, అరుణతార పత్రిక సంపాదకుడు, మానవహక్కుల ఉద్యమ కార్యకర్త వరలక్ష్మి కూడా పవన్ ఫ్యాన్స్ తీరును విమర్శించారు. వీరే కాక మరికొంత మంది ప్రముఖులు కూడా మహేష్ కత్తికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిఫెన్స్ లో పడ్డట్లవుతోంది. ఏ సోషల్ మీడియాలో అయితే మహేష్ కత్తిని టార్గెట్ గా చేసుకుని, పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారో, ప్రస్తుతం అదే సోషల్ మీడియా వేదికగా మహేష్ కత్తికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుండడం చెప్పుకోదగ్గ విషయమే.


