ఇండియాలో నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను విభాగం మొదలు పెట్టిన ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ డ్రైవ్ ఊపందుకుంది. తొలుత కోటికి పైగా అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను నిశితంగా పరిశీలించి, భారీ ఎత్తున నగదు డిపాజిట్ అయిన 18 లక్షల ఖాతాలను తదుపరి దర్యాఫ్తుకు ఎంపిక చేశారు. పెద్ద నోట్లు రద్దయిన తరువాత ఈ ఖాతాల్లో భారీ ఎత్తున నగదు వచ్చి చేందని ఐటీ అధికారులు గుర్తించారు.
అన్ని కేటగిరీల్లోని బ్యాంకు ఖాతాలూ తమ పరిశీలనలో ఉన్నాయని, అనుమానాస్పద ఖాతాల్లో నగదు చేరికపై ఎస్ఎంఎస్ లు, ఈ-మెయిల్స్ పంపి వివరణ అడుగుతున్నామని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. తమ డేటాబేస్ లోని కోటికి పైగా ఖాతాల నుంచి 5 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ అయిన 18 లక్షల ఖాతాలను విచారించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
పన్ను చెల్లింపుదారులను వేధించాలని భావించడం లేదని, ఖాతాదారుల నుంచి వచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. జనవరి 31వ తేదీన మోడీ సర్కారు ప్రారంభించిన ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో సాగుతున్న ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా సదరు చర్యలను చేపడుతున్నారు.



