అయిదు వన్డేల సిరీస్లో భాగంగా అంటిగ్వా నార్త్ సౌత్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 93 పరుగుల తేడాతో కరీబియన్ జట్టును ఓడించి సిరీస్ లో 2-0 ఆధిక్యంతో నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకే చాప చుట్టేసింది.
భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, హార్ధిక్ పాండ్యాల నిప్పులు చెరిగే బంతులకు విండీస్ బ్యాట్స్ మెన్లు ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకుని వెంటవెంటనే పెవిలియన్ చేరారు. జాసన్ మొహమ్మద్ 40, రోవ్ మన్ పావెల్ 30, షాయ్ హోప్ 24 పరుగులు చేయగా ఆ తర్వాత అత్యధిక పరుగులు వచ్చింది ఎక్స్ ట్రాల ద్వారానే. భారత బౌలర్లు 23 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో సమర్పించుకోవడం విశేషం. అయితే క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్టే పెవిలియన్కు క్యూ కట్టడంతో విండీస్ 38.1 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 11 పరుగులకే శిఖర్ ధావన్ (2) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. మైదానం తడిగా ఉండడంతో పరుగులు రాబట్టడం బ్యాట్స్ మెన్కు కష్టమైంది. దీంతో మ్యాచ్ ఎటువంటి మెరుపులు లేకుండా నిదానంగా సాగింది. ఈ క్రమంలో 34 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (11) రెండో వికెట్ రూపంలో వెనుదిరగ్గా, ఆ తర్వాత వచ్చిన యువరాజ్ సింగ్ 39 పరుగులతో ఫరవాలేదనిపించాడు. మరో వైపు ఓపెనర్ అజింక్య రహానే విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
112 బంతులు ఎదుర్కొన్న రహానే 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 72 పరుగులు చేసిన తర్వాత నాలుగో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇక ధోనీ 79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివరల్లో కేదార్ జాదవ్ మెరుపులు మెరిపిస్తూ 26 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 40 పరుగులు చేశాడు. ఈ విజయంతో భారత్ ఐదు వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించించింది.



