విజయం సాధించాలంటే పట్టుదల ఉంటే సరిపోదు. ఆటలో మెళుకువలు, ప్రత్యర్ధుల బలహీనతలు, మన బలాలు అన్ని తెలిసి ఉండాలి. అప్పుడే విజయం వెతుక్కుంటూ వస్తుంది. సరిగ్గా పీవీ సింధు కూడా ఇదే అనుసరించి రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీ ఫైనల్లో ప్రత్యర్ధి ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టి, స్వర్ణం సాధించడానికి మరో ఒక్క అడుగు దూరంలో నిలుచుంది.
తొలి సెట్ హోరాహోరీగా జరగడంతో 19-21 వద్ద ముగిసింది. రెండో సెట్ లో కూడా 10 పాయింట్లు ముగిసే సమయానికి ఇరువురు సమఉజ్జీలుగా నిలవడంతో ఉత్కంఠభరితంగా ముగుస్తుందన్న అంచనాకు వచ్చేసారు. ఇక్కడే సింధు తన ప్రతాపం చూపింది. బలమైన షాట్లతో ప్రత్యర్ధి ఒకుహరాపై విరుచుకుపడడంతో కోలుకోలేని పరిస్థితికి వచ్చేసింది. దీంతో ఒకుహరా 10 పాయింట్ల వద్ద ఉండగానే, సింధు 21 పాయింట్లు సాధించి మ్యాచ్ ను ముగించింది.
ఓ పక్కన సింధు కొడుతున్న షాట్లకు అభిమానులు ‘ఇండియా… ఇండియా…’ అంటూ నినాదాలు చేసి మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇదే ఫాంను ప్రదర్శిస్తే… ఫైనల్లో జయకేతనం ఎగురవేసి భారత్ కు స్వర్ణం అందించడం అంత కష్టసాధ్యమైన విషయమేమీ కాదన్నది మ్యాచ్ ను తిలకించిన వారెవరైనా చెప్పే విషయమే. ఈ విజయంతో సింధు ఇంట విజయోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ మాటకొస్తే… ఒక్క సింధు ఇంట ఏముంది… దేశవ్యాప్తంగా ప్రస్తుతం మన హైదరాబాదీ క్రీడాకారిణి సింధు పేరే మారుమ్రోగుతోంది.



