మొదటి వన్డే కివీస్ ఇచ్చిన షాక్ నుండి తేరుకున్న టీమిండియా రెండవ వన్డేలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి, సిరీస్ ను 1-1తో సమానం చేసింది. కీలకమైన రెండవ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ మరియు బూమ్రాలు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కివీస్ జట్టు ఏ తరుణంలోనూ తేరుకోలేకపోయింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లి (29), హార్దిక్ పాండ్య (30) వికెట్లను స్వల్ప పరుగులకు కోల్పోయినప్పటికీ, శిఖర్ ధావన్ (68), దినేష్ కార్తీక్ (64 నాటౌట్), ధోని (18నాటౌట్) రాణింపుతో అవలీలగా చేధించగలిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా భువనేశ్వర్ కుమార్ ఎంపిక కాగా, ఈ విజయంతో కివీస్ పై 50వ విక్టరీని నమోదు చేసుకుంది. 100వ మ్యాచ్ లో తలపడ్డ టీమిండియా 50వ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
అత్యధికంగా శ్రీలంకపై 88 విజయాలను అందుకున్న టీమిండియా, విండీస్ పై 56, ఇంగ్లాండ్ పై 52, పాకిస్తాన్ పై 52, జింబాబ్వేపై 51 విజయాలను అందుకుంది. ఈ క్రమంలో అయిదు జట్లపై 100 వన్డేలు ఆడిన మొదటి జట్టుగా కూడా టీమిండియా సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. మూడవ వన్డేలో విజయాన్ని బట్టి సిరీస్ విజేత ఎవరో నిర్ణయం కానుంది.


