బుధవారం నాడు జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి మళ్ళీ బౌలింగ్ తీసుకున్న టీమిండియా, శ్రీలంకను మరోసారి 231 పరుగుల తక్కువ స్కోర్ కే పరిమితం చేసింది. దీంతో మరోసారి అలోవొక విజయం ఖాయమని అంతా భావించారు. దానికి తగ్గట్లే 6కి పైగా రన్ రేట్ తో తొలి వికెట్ కు ఏకంగా 109 పరుగులు జోడించారు ఓపెనర్లు. తొలి వికెట్ గా వెనుదిరిగిన రోహిత్ శర్మ తర్వాత క్రీజులోకి వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లి అడుగు పెట్టాల్సి ఉంది, కానీ అలా జరగలేదు.
ఖచ్చితంగా తమదే విజయం అని భావించిన విరాట్ కోహ్లి, తనకు బదులు బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం కేఎల్ రాహుల్ ను పంపించారు. దీంతో అసలు ట్విస్ట్ ప్రారంభమైంది. ఆ వెంటనే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా వెనుదిరగగా, అప్పుడు కూడా విరాట్ రాకుండా కేదార్ జాదవ్ ను పంపించారు. అనుకున్నదొక్కటి… అయ్యింది ఒక్కటి… అన్నట్లుగా తాను భావించింది కాకుండా, క్రీజులో ఉన్న రాహుల్, జాదవ్ లతో పాటు తాను కూడా ఒకే ఓవర్లో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
ఇక డిఫెన్స్ లో పడ్డ టీమిండియా ఆ వెంటనే మరో రెండు వికెట్లు నేలకూలాయి. దీంతో అవలీలగా గెలుస్తుందని భావించిన టీమిండియా, ఒక్కసారిగా ఓటమి సైడ్ కు వెళ్లిపోయింది. ధోని క్రీజులో ఉన్నాడు కాబట్టి, అభిమానులకు ఇంకా గెలుస్తుందన్న నమ్మకం కాస్త ఉన్న మాట వాస్తవమే గానీ, అక్కడ గెలిపించింది బౌలర్ భువనేశ్వర్ కుమార్. ధోని అండతో భువనేశ్వర్ గెలిపించకపోతే, శ్రీలంక చేతిలో పరాభవం చవిచూడాల్సి వచ్చేది. అయితే శ్రీలంకకు ఈ అవకాశాన్ని ఇచ్చింది మాత్రం విరాట్ కోహ్లినే అని చెప్పాలి.
ఇప్పటివరకు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పై టీమిండియా పెద్దగా ఆధారపడిన సందర్భాలు లేవు. కానీ కోహ్లి చేసిన పరీక్షతో మిడిల్ ఆర్డర్ లోని డొల్లతనం శ్రీలంకకు తెలిసి వచ్చినట్లయ్యింది. అలాగే తొలి మూడు వికెట్లు తీయగలిగితే, టీమిండియాను ఓడించడం ఈజీ అన్న మనోబలాన్ని శ్రీలంకకు ఇచ్చినట్లయ్యింది. ఇలాంటి సందర్భంలోనూ మనోనిబ్బరాన్ని ప్రదర్శిస్తూ… అద్భుతంగా ఆడిన భువనేశ్వర్ కుమార్ ను ప్రశంసించకుండా ఉండలేం. ఇలాంటి సందర్భాలలో ధోని లెక్కకు మించిన సార్లు క్రీజులో ఉన్నారు. కానీ భువికి ఇది కొత్త. మొత్తానికి శ్రీలంకను ఊరించినట్లే ఊరించి మ్యాచ్ ను సొంతం చేసుకుంది టీమిండియా.


