జగన్ తాడేపల్లి ప్యాలస్లో నుంచి బయటకు రావడం లేదని టీడీపి నేతలు విమర్శిస్తుంటారే గానీ ఆయన ఇంట్లో కూర్చొని చేస్తునంత ‘హోం వర్క్’ వాళ్ళు బయట ఉండి చేస్తున్నారా లేదా?అని సందేహం కలుగుతుంది.
జగన్ చాలాసార్లు దుందుడుకు నిర్ణయాలు తీసుకొని తప్పటడుగులు వేస్తుండవచ్చు. కానీ రైతులు సమస్యలు, విద్యార్ధుల ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ వంటి విషయాలపై ఆయన పోరాటానికి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన తర్వాతే హడావుడిగా వాటిని అమలు చేస్తుండటం చూసినప్పుడు జగన్ ముందున్నారా… కూటమి వెనుకబడిందా? అనే సందేహం కలుగక మానదు.
ఉదాహరణకు మామిడి రైతుల పరామర్శ ప్రకటన వెలువడిన తర్వాతే టీడీపిలో చలనం కలిగిందా?లేక సిఎం చంద్రబాబు నాయుడు, టీడీపి ఎంపీలు ఈ సమస్యపై కేంద్రాన్ని ఒప్పించి మద్దతు ధర సాధించేందుకు కృషి చేస్తున్నారని జగన్ ముందుగానే పసిగట్టి, ఆ ప్రకటన వెలువడేలోగానే పరామర్శయాత్రలకు బయలుదేరారా?అనే సందేహం కలుగుతుంది.
జగన్ మామిడి రైతులని పరామర్శించి కూటమి ప్రభుత్వం చేయాల్సిన విమర్శలు, ఆరోపణలు చేసి, రోడ్లపై మామిడికాయలు పారబోసి డ్రామా రక్తి కట్టించిన తర్వాతా, తన పాలనలో, చంద్రబాబు పాలనలో మామిడి ధరలు వగైరా ముచ్చట్లు చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా జరిగి అప్పుడే వారం రోజులైంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో “తోతాపురి మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం అండ” అంటూ తమ నేతల ఫోటోలు, మద్దతు ధరలతో ప్రకటనలు విడుదల చేయడం చూస్తున్నప్పుడు, జగన్ ముందున్నారా… కూటమి వెనుకబడిందా?అనే సందేహం కలుగుతుంది.
జగన్ మామిడి రైతుల సమస్యల పోరాడినందునే కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టి మద్దతు ధర ప్రకటించిందని వైసీపీ నేతలు చెప్పుకోకుండా ఉంటారా?
జగన్ తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని ఇంత హోం వర్క్ చేయగలిగినప్పుడు, నిత్యం ప్రజల మద్య ఉండే కూటమి నేతలు మరింకెంత చేయాలి? ఇటువంటి చిన్న చిన్న విషయాలే ఎన్నికలలో జాతకాలు తారుమారు చేసేస్తాయని గ్రహిస్తే మంచిది.




