తనదైన కామెడీ పంచ్ లతో జనాన్ని కడుపుబ్బా నవ్వించే కార్యక్రమం ‘జబర్దస్త్’ టీంకు కోర్టు కష్టాలు ఎదురయ్యాయి. ‘జబర్దస్త్’లో ప్రదర్శించిన ఓ స్కిట్ లో న్యాయవాద వృత్తిని అగౌరవ పరిచేలా ఓ స్కిట్ వేశారన్న కారణంగా సదరు కార్యక్రమ టీం సభ్యులతో పాటు కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ టాలీవుడ్ నటులు నాగబాబు, రోజా మరియు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, యాంకర్లు రష్మి, అనసూయ తదితరులైన మొత్తం 22 మందికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
న్యాయవాది అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ మేరకే కోర్టు నోటీసులు అందుకున్న ‘జబర్దస్త్’ టీంలోని సభ్యుల్లో పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వరరావు, ఫణి తదితరులు శుక్రవారం నాడు హుజురాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమ అయిన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజా మరియు యాంకర్లు రష్మీ, అనసూయలు మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. వీరి తరఫున న్యాయవాది హాజరు కాగా, తదుపరి విచారణను న్యాయమూర్తి జూన్ 30కి వాయిదా వేశారు.



