వర్షం కురిస్తే అది ఈ దేవుడి బిడ్డడి పాలన మహత్యం! అదే… వర్షాలు కురవక కరువు ఏర్పడితే అది ప్రత్యర్ధుల ఐరెన్ లెగ్ పాలన మహత్యం.. అని వాదించే నేతలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు.
ఎల్నినో ప్రభావం వలన ఈ ఏడాది దేశంలో, రాష్ట్రంలో ఒకచోట కుండపోతగా వానలు పడుతూ ఊర్లను ముంచేస్తుంటే, మరోపక్క ఎండలు మండిపోతున్నాయి… తాగుసాగు నీరు లేక ప్రజలు, రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు.
సెప్టెంబర్ నెల వచ్చేసినా ఇంకా ఎండలు దంచుతూనే ఉన్నాయి. ఏసీలు నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ హటాత్తుగా కుండపోత వాన పడుతోంది.
ఎల్నినో ప్రభావం వల్ల దేశంలో ఇలాంటి విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొందని వాతావరణ నిపుణులు చెపుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా ఇటువంటి వాతావరణమే కొనసాగవచ్చని చెపుతున్నారు. కనుక ముందున్నది ముసళ్ళ పండగ అనుకోవాల్సిందే.
ఇటీవల ఓ వారం పదిరోజుల పాటు రాష్ట్రంలో ఎండలు దంచి కొట్టడంతో ఉషోగ్రతలు పెరిగిపోయాయి. అప్పుడు కొందరు వైసీపీ నాయకులు ‘చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువే.. అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా సకాలంలో వర్షాలు కురిసేవి,” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా తెలీనివారికి ‘ఎల్నినో’ దాని ప్రభావం గురించి తెలుస్తుందని అనుకోలేము. అయితే మొన్న భారీగా వర్షం పడి విజయవాడలో పలు ప్రాంతాలు నీట మునిగినప్పుడు, అదే వైసీపీలు ‘అమరావతి ఉందా మునిగిందా?’ అంటూ పైశాచికానందం పొందారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో బుడమేరు పొంగి ఇలాగే విజయవాడ మునిగితే అప్పుడు ఆ వరద నీటిలో నిలబడి జగన్ ఫోటోలు తీసుకొని అచ్చేయించుకున్న సంగతి మరిచిపోయినట్లున్నారు
వైసీపీల లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడవు. కానీ పడినప్పుడు పడిందని చెప్పాలి కానీ పడితే అమరావతి మునిగిందంటూ మాట్లాడుతుంటారు. పడకపోతే చంద్రబాబు-కరువు అంటారు. వైసీపీ ద్వంద నీతికి ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఏముంటుంది?





