తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలతో ఆంధ్రాకు ఎటువంటి సబంధమూ లేకపోయినా, దానిలో ఆంధ్రా పాలకులు, కృష్ణా జలాలు, రాయలసీమలోని ప్రాజెక్టుల గురించి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతుండటం విశేషం.
ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలలో ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్-జగన్ మద్య కూడా క్విడ్-ప్రో జరిగిందని, దానికి చంద్రబాబు నాయుడు బలైపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్కు గిట్టదని అందరికీ తెలుసు. కనుక ఆయనను ఏదోవిదంగా గద్దె దించి ఏపీకి ముఖ్యమంత్రి అవ్వాలని తపిస్తున్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సాయం కోరారు. అందుకు ప్రతిగా తెలంగాణలో ఏపీకి చెందిన స్తిరాస్తులన్నిటినీ జగన్ కేసీఆర్కు అప్పగించేశారు. మళ్ళీ ఇందుకు ప్రతిగా రాయలసీమలో ప్రాజెక్ట్ కట్టుకోవడానికి కేసీఆర్ అంగీకరించారు.
ఇద్దరి మద్య ఈ ఒప్పందాలు కుదిరిన తర్వాతే 2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపిని ఓడించి చంద్రబాబు నాయుడి గద్దె దించి, జగన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ అన్నివిధాలా సహకరించారు. కేసీఆర్-జగన్ మద్య జరిగిన ఈ క్విడ్-ప్రోకి చంద్రబాబు నాయుడు బలైపోయారు.
ఈ క్విడ్-ప్రో ఒప్పందంలో భాగంగానే జగన్ ప్రభుత్వం రాయలసీమలో ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నా కేసీఆర్ అటువైపు కన్నెత్తి చూడలేదు. అభ్యంతరం చెప్పలేదు. చెప్పి ఉండి ఉంటే జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని నిర్మించగలిగేదా?” అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ళ తర్వాత కూడా నేటికీ తెలంగాణ శాసనసభలో ఏపీ పాలకులు, ఏపీ రాజకీయాలు, ఏపీకి చెందిన అంశాలపై ఇటువంటి చర్చలు జరుగుతుండటం చాలా ఆసక్తికరం అనుకుంటే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉద్ధారకులమని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్, జగన్ల తెర వెనుక కధలు కూడా బయటపడుతుండటం రెండు రాష్ట్రాల ప్రజలకు దిగ్బ్రంతి కలిగించక మానవు.




