మంచివాడితో స్నేహం చేస్తే గౌరవం పెరుగుతుంది. అదే అవినీతిపరుడితో స్నేహం చేస్తే సమాజంలో గౌరవం కోల్పోతారు. ఇందుకు వైసీపీ అధినేత జగన్ కంటే గొప్ప నిదర్శనం ఎవరుంటారు?
అక్రమాస్తుల కేసులలో జగన్ జైలుకి వెళ్ళడం విచిత్రం కాదు. కానీ ఆ వ్యవహారాలలో ఆయనతో చేతులు కలిపిన ప్రతీ ఒక్కరూ జైలుకి వెళ్ళారు లేదా నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
జగన్ కళ్ళలో ఆనందం కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడిన అనేకమంది ప్రస్తుతం జైల్లో ఉన్నారు లేదా బెయిల్పై ఉన్నారు.
జగన్ రాజకీయాల ద్వారా ప్రజలపై కూడా ప్రభావం చూపగలిగారు. కనుక ప్రజలు ఆయనని ఎన్నుకున్నారు. అందుకు 5 ఏళ్ళు నరకయాతన అనుభవించారు. నేటికీ ఆయన చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇందుకు అతీతం కాదని అరెస్టుతో మరోసారి నిరూపితమైంది. జగన్ వద్దనుకున్న అమరావతిని చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నారు. కానీ దానిని అడ్డుకునే పరిస్థితిలో లేరు. కనుక చేతిలో ఉన్న సాక్షి మీడియాతో అమరావతిపై బురద జల్లిస్తూ ‘అదో వేశ్యల రాజధాని’ అని మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేత చెప్పించి కడుపులో అక్కసు వెళ్ళ గ్రక్కారు.
ఒక రాష్ట్రానికి ప్రభుత్వం రాజధాని నిర్మిస్తున్నప్పుడు దానిలో అవినీతి, అక్రమాలు లేదా లోపాలు జరుగుతుంటే తప్పకుండా విమర్శించవచ్చు. కానీ రాజధానిపై ఈవిదంగా బురద జల్లడం చాలా తప్పు… అని సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి తెలియదనుకోలేము. కానీ జగన్ సహవాసంతో ఆయన కూడా తప్పు మార్గంలో సాగారు. అరెస్ట్ అయ్యారు.
సాక్షి ఛానల్లో అమరావతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను, తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేసి గుంటూరు తీసుకువచ్చారు. ఆయనతో సహా కృష్ణంరాజు, సాక్షి మీడియా పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు.
ఈరోజు ఆయనని కోర్టులో హాజరుపరుస్తారు. ఈ కేసులో కృష్ణంరాజు (ఏ-1), కొమ్మినేని శ్రీనివాసరావు (ఏ-2), సాక్షి మీడియా (ఏ-3)గా పేర్కొన్నారు. రాజధాని మహిళల ఆగ్రహానికి భయపడి పరారీలో ఉన్న కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.




