అధికార పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలలో గెలవడం సర్వసాధారణం. హిందూపురం మున్సిపాలిటీ ఛైర్మన్, నెల్లూరు, ఏలూరు డెప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ పడవులతో సహా మొత్తం 12 పదవులలో 7 కూటమి గెలుచుకుంది.
కానీ టీడీపీ నేతలు తమ సభ్యులను భయపెట్టి, ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం వలననే గెలిచిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమనుకుంటే, అటువంటి నేతలు ఎల్లకాలం టీడీపీకి విధేయంగా ఉండకపోవచ్చు. కనుక టీడీపీయే నష్టపోతుంది కదా? ఇందుకు వైసీపీ సంతోషించాలి కానీ బాధ పడటం దేనికి?
అయినా ఓ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఎన్నికలలో గెలిచి సత్తా చాటుకుంటేనే దానికి బలం ఉందని ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా నమ్మకం కలుగుతుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను, కార్యకర్తలని ఎంతగానో వేధిస్తున్న సమయంలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆ మూడింటినీ టీడీపీ గెలుచుకుంది కదా?
ఊహించని ఆ దెబ్బకు జగన్ షాక్ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ మళ్ళీ తలెత్తలేదని ధీమాగా ఉంటే, ఒకేసారి మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకోవడంతో, ఆ ఓటమిని భరించలేక, ఒప్పుకోలేక ‘జగనన్నా..’ అంటూ వెనకే తిరిగే ఉండవల్లి శ్రీదేవితో సహా వైఎస్సార్ కుటుంబానికి వీరవిధేయంగా ఉండే ఆనం, మేకపాటి, కోటంరెడ్డి నలుగురు సీనియర్ నాయకులు (ఎమ్మెల్యేలు)ని నిందిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
జగన్ తిరుగులేని అధికారం చలాయిస్తున్నప్పుడే ఇదంతా జరిగింది. అప్పుడే గెలవలేనప్పుడు, శాసనసభ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి ప్రజలకు మొహం చూపించలేక తాడేపల్లి ప్యాలస్లో జగన్కాలక్షేపం చేస్తునప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని ఎలా అనుకోగలం?
ఒకవేళ ఈ స్థానాలన్నీటినీ వైసీపీ గెలుచుకొనేలా చేయగలిగితే జగన్ కూడా చంద్రబాబు నాయుడులా తన సత్తా చూపించుకోవచ్చు కదా? ఎవరు కాదన్నారు?
శాసనసభ ఎన్నికలలో వైసీపీ ఓటమితో సహా జగన్ తన ప్రతీ వైఫల్యానికి ఎవరో ఒకరిని నిందిస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరిని బలి చేస్తూనే ఉన్నారు తప్ప తన ఇగోని పక్కన పెట్టి, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా తనలో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ ధోరణే వైసీపీకి శాపంగా, కూటమికి శ్రీరామరక్షగా నిలుస్తోంది.






