తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సుస్మిత రేపిన రాజకీయ చిచ్చు కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తో పూర్తిగా సద్దుమణిగిపోయినట్టేనా.? లేదా కాస్త విరామం తో త్వరలోనే ఈ వివాదం తాలూకా సెకండ్ ఎపిసోడ్ తిరిగి ప్రారంభం కానుందా.? అన్న సందేహం సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతోంది.
అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బిఆర్ఎస్ మధ్య రాచుకున్న రాజకీయ నిప్పు ఒకరకంగా కొండా వివాదాన్ని పూర్తిగా మరుగునపడేలా చేసిందనే చెప్పాలి. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తన పై చర్యలా అంటూ మొదలు పెట్టిన కొండా సురేఖ చివరికి సుస్మిత మాదిరే రేవంత్ టార్గెట్ గా ఆరోపణలు చేసారు.
రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం కారణంగానే తన మంత్రి పదవి పోయిందంటూ కొండా సురేఖ రేవంత్ పై ఎక్కిపెట్టిన విమర్శలు, రేవంత్ తన తల్లి పై ఇంత రాజకీయ కక్ష తీర్చుకుంటారనుకోలేదు అంటూ సుస్మిత చేసిన ఆరోపణలు, ఏదైతే అది చూసుకుందా అంటూ మీసం మెలిసి ధీమాగా కనిపించిన కొండా మురళి చర్యలు అన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ నేతలు చేసిన నిరసన కార్యక్రమాలతో కొట్టుకుపోయాయి.
ఒకరకంగా బిఆర్ఎస్ శ్రేణులు చేసిన ఈ రచ్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ కి కాస్త ఉపశమనం తీసుకొచ్చిందనే చెప్పాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం అంతర్గత కుమ్ములాటలు మొదలు, సీఎం రేవంత్, ఆయన సోదరులు అవినీతికి పాల్పడుతున్నారంటూ, భూకబ్జాల తో రెచ్చిపోతున్నారంటూ సొంత పార్టీలోని మంత్రి కుమార్తె ఆరోపణలు చేస్తుంది అంటూ సీఎం రేవంత్ టార్గెట్ గా మరికొంత రాజకీయ రచ్చకు ఆస్కారం ఉండేది.
కానీ వాటన్నింటిని బిఆర్ఎస్ నాయకులు తమ నిరసన కార్యక్రమాలతో పక్కదారి పట్టిస్తే, అటు అధికార పార్టీ కూడా దానికి కౌంటర్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి అంటూ పిలుపునిచ్చి కొండా వివాదాన్ని ప్రస్తుతానికి పూర్తిగా కనుమరుగు చేసేసింది. అయితే ఈ వివాదం ఎప్పుడోకప్పుడు తప్పఁకుండా తిరిగి రాజుకుంటుంది, అది సీఎం రేవంత్ టార్గెట్ గా దూసుకొస్తుందని తెలిసినప్పటికీ ప్రస్తుతానికి సద్దుమణిగినట్టే కనిపిస్తుంది.





