ప్రస్తుతం రాష్ట్రానికి సంబందించి కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే సభకు రానని జగన్ వాదనలు చాక్లెట్ ఇవ్వకపోతే స్కూలుకి వెళ్ళనని మారాం చేస్తున్న చిన్నపిల్లాడిలాగే ఉందనిపిస్తుంది.
జగన్ తన పిరికితనం దాచిపుచ్చుకుని శాసనసభకు వెళ్ళకుండా తప్పించుకునేందుకు వేసుకున్న ముసుగే ప్రతిపక్ష నాయకుడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా డిమాండ్ అని భావించవచ్చు. శాసనసభకు వెళితే అవమానింపబడతాననే భయంతో జగన్ ఈ వంకతో తప్పించుకుంటున్నారని సామాన్య ప్రజలకు కూడా తెలుసు.
ప్రభుత్వం ఆయనకు ఆ హోదా ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్నలనే శాసనసభకు వెళ్ళి సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రులను నేరుగా అడిగి సమాధానాలు చెప్పించవచ్చు. చెప్పలేకపోతే విమర్శించవచ్చు. తమ వాదనలు నిజమే అని ప్రజలకు ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా?
సిఎం చంద్రబాబు నాయుడు దమ్ముంటే తనని అరెస్ట్ చేయమని ఎందుకు సవాలు చేస్తున్నారంటే, ఇదివరకు తాను చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయనకు లభించినట్లే తనకి కూడా ప్రజల సానుభూతి, మద్దతు లభిస్తుందనే దురాశ కావచ్చు. ప్రజల సానుభూతి కావాలనుకుంటే ధైర్యంగా శాసనసభకు వెళ్ళి అక్కడ అవమానింపబడినా లభిస్తుంది కదా? కానీ ఇంత పిరికితనం దేనికి?
తాను చేస్తున్న ఈ వితండవాదంతో ప్రజల దృష్టిలో, ముఖ్యంగా పార్టీ శ్రేణుల దృష్టిలో ఇంకా పలుచనవుతానని జగన్కు తెలియదా? లేదా పార్టీలో ఎవరూ చెప్పారా? అంటే తెలుసు… చెప్పేఉంటారు.
అయినా కూడా సభకు వెళ్ళి అవమానపడటం కంటే కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని ప్రెస్మీట్లు పెడుతూ, సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ ప్రజలను మభ్యపెట్టడమే సులువని జగన్ భావిస్తున్నట్లున్నారు.
కనుక జగన్ ధరించిన ఆ పిరికితనం ముసుగుని తొలగించి శాసనసభకు రప్పించేందుకుగాను, ప్రభుత్వం ఆయన కోరుతున్నట్లుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే బాగుంటుంది. జగన్ చేస్తున్న ఈ రాజకీయ డ్రామాకి ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదాతోనే చెక్ పెట్టడం మంచిది.
జగన్ అహం గురించి అందరికీ తెలుసు కనుక అప్పుడైనా శాసనసభకు వస్తారనే నమ్మకం లేదు. అప్పుడూ మరో కుంటిసాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే జగన్ పిరికితనం, రాజకీయ డ్రామా బయటపడుతుంది కదా?






