పాదయాత్ర – 2.0: సీక్వెలా.? ప్రీక్వెలా.?

Jagan Padayatra 2.0: Sequel or Strategy?

అధికారం కావాలంటే పాదయాత్ర, అధికారం వస్తే పరదాల యాత్ర అన్నట్టుగా ఉంటుంది జగన్ రాజకీయ ప్రయాణం. 2019 ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ పదవి కోసం ప్రజలు చుట్టూ ప్రదక్షణలు చేసారు జగన్.

ముద్దులు పెట్టుకుంటూ, హగ్గులు ఇచ్చుకుంటూ, రావాలి జగన్…కావాలి జగన్, చెప్పాడంటే చేస్తాడంతే, మాట తప్పం మడం తిప్పం…అంటు రాజకీయ స్లొగన్స్ ఇచ్చుకుంటూ పార్టీ క్యాడర్ ను ఉద్దేజపరుస్తూ, ప్రజలను తన దారికి తెచ్చుకున్నారు జగన్.

ADVERTISEMENT

తీరా అధికారం చేతికి రాగానే పదవి కోసం ప్రజల చుట్టూ తానూ చేసిన ప్రదక్షణలు మరిచిపోయిన జగన్, తన దర్శన భాగ్యం కోసం, తన ఆపన్న హస్తం కోసం సొంత పార్టీ ఎమ్మెల్యే లను, మంత్రులను సైతం తాడేపల్లి ప్యాలస్ గేట్ బయట నిలబెట్టారు.

ఇక సామాన్య ప్రజానీకం సంగతి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనేలా జగన్ వ్యవహార శైలి నడిచింది. జగన్ ప్యాలస్ దాటి అడుగు బయట పెడితే, రోడ్డు మార్గం అయితే పరదాలు, ఆకాశ విహారమైతే చెట్లు నరికివేత…ఇలా నిత్యం అభద్రతా భావంలో జగన్ ప్రజలకు దూరంగా ప్యాలస్ ప్రభుత్వాన్ని నడిపారు.

ఇక 2024 లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో తిరిగి ప్రజలతో ప్రత్యక్ష బంధానికి ప్రణాళికలు రచిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్. ఇందుకుగాను ప్రజల మధ్యకు వచ్చేందుకు ఒక్కో కారణంతో ఒక్కో పర్యటనకు మార్గాన్ని వేసుకుంటూ ఓ సారి పరామర్శల పేరుతో,

మరోసారి ఓదార్పు వంక చూపుతూ, ఇంకోసారి జైలు యాత్రలకు శ్రీకారం చుడుతూ ఇలా ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టడానికి శవ రాజకీయాలకు కూడా వైసీపీ వెనకాడడం లేదు. అయితే వైసీపీ ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు, పార్టీ ఓటమి భారం నుంచి క్యాడర్ ను పోరాటానికి సిద్ధం చేసేందుకు జగన్ మళ్ళీ పాత స్క్రిప్ట్ నే ఫాలో అవుతున్నారు.

అందుకుగాను రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల ముందు మరొకసారి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు. నేడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమైన జగన్ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ తానూ భవిష్యత్ లో చేయబోయే పాదయాత్రలో మిమ్మల్ని అందరిని ప్రత్యక్షంగా కలుస్తానంటూ హామీ ఇచ్చారు.

అంటే జగన్ కు పదవి అవసరం ఉంటే ప్రజలు కావాలి, పార్టీ కార్యకర్తలు కావాలి. అందు కోసం పాదయాత్రలు చేస్తారు, పోరాట యాత్రలు చేస్తారు. అలాగే పార్టీ అధికారం కోసం కాళ్లరిగేలా పాదయాత్రలు చెయ్యగలరు.

కానీ ఒక్కసారి అధికారం చేతికొచ్చిందా…చింతపండు నుంచి తిరుమల దర్శన టికెట్ల వరకు, వినోదం నుంచి విజ్ఞానం, ప్రభుత్వ జీవో ల నుంచి రాష్ట్ర రాజధాని వరకు వరకు ఏ అంశం మీదనైనా మోనార్క్ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాభిప్రాయానికి అధికారం అనే సంకెళ్లు తొడుగుతారు.

అయితే రాబోయే ఎన్నికల కోసం జగన్ చేస్తాను అంటు ప్రకటించిన పాదయాత్ర 2.0 ఆయన గత వైసీపీ చిత్రానికి సీక్వెలా.? ప్రీక్వెలా.? అన్నది తేలాల్సి ఉండి. ఒకవేళ వైసీపీ విధ్వంసానికి ఈ పాదయాత్ర 2.0 సీక్వెల్ అయితే వైసీపీ కి మరో ఛాన్స్ కష్టమనే చెప్పాలి.

అలాకాకుండా గతంలో జగన్ పాదయాత్ర తరువాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుని ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు తెలుసుకుని, జగన్ వేసిన తప్పటడుగులు ఒప్పుకుని, అప్పటి పాదయాత్రకు ముందు కనిపించిన జగన్ ను భవిష్యత్ లో ఆవిష్కరించగలిగితే వైసీపీ ప్రస్తుత స్థానాన్ని, స్థాయిని మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories