కడపలో నేటి నుంచి మొదలైన మహానాడు సభ తొలిరోజున మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నాడు శాసనసభలో నా తల్లిని అవమానించావు. నా తల్లినే కాదు.. మీ సొంత తల్లిని, చెల్లిని కూడా అవమానించావు. తల్లులను చెల్లులని అవమాణిస్తే ఏమవుతుందో అర్దమయిందా రాజా?” అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడుని జగన్ తీవ్రంగా ద్వేషిస్తారు కనుక శాసనసభలో ఆయనని ఈసడించుకుని, చాలా దారుణంగా అవమానించారు.
ఆయనపై ద్వేషంతోనే రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన సతీమణి భువనేశ్వరిని కూడా కొడాలి నాని, రోజా వంటి వారితో చులకనగా మాట్లాడించారు. వారు అలా మాట్లాడుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకుంటే, జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం అనుభవించారు కూడా.
నాడు దుర్యోధనుడు నిండు సభలో చేసిన ద్రౌపదీ వస్త్రాపహారణానికి, వర్తమానంలో జగన్ శాసనసభలో చేసిన దానికీ పెద్ద తేడా ఏమీ లేదనే చెప్పాలి.
శాసనసభలో జరిగిన ఆ రాజకీయ వస్త్రాపహారణాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు. అందుకే జగన్ని గద్దె దించారని మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట అక్షరాల నిజం.
కానీ ఆ అధికార మదంతోనే తల్లి విజయమ్మని తన కోసం కాళ్ళు అరిపోయేలా పాదయాత్రలు చేసిన చెల్లి షర్మిలని కూడా జగన్ అత్యంత అవమానకరంగా బయటకు సాగనంపడం ఎవరూ ఊహించలేనిదే.
రాష్ట్రంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేసేయాలనే దురాలోచనతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు, డాక్టర్ సుధాకర్, ఎంపీ రఘురామకృష్ణ రావు వంటివారిని ఎందరినో హింసించారు. తద్వారా జగన్ పైశాచికనందం అనుభవించి ఉండవచ్చు. కానీ అధికారం కోల్పోయారు కదా?
జగన్ ఇతరుల పట్ల ఏవిదంగా అవమానకరంగా వ్యవహరించారో, 175కి 175 సీట్లు వస్తాయనుకున్న ఆయనకు కేవలం 11 సీట్లు లభించడం అవమానకరమే కదా?
అంటే జగన్ అకృత్యాలను రాష్ట్ర ప్రజలు చాలా నిశితంగా గమనించారని ఏదీ వారి దృష్టిని తప్పించుకోలేదని స్పష్టమైంది కదా?
రాజకీయ ప్రత్యర్ధులు, ప్రజలు, చివరికి సొంత చెల్లి కూడా ఇంతగా బుద్ధి చెప్పినా జగన్ ధోరణి మాత్రం మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తుల కోసం జగన్ నేటికీ తల్లిని, చెల్లిని ఇంకా కోర్టుల చుట్టూ తిప్పిస్తూనే ఉన్నారు. వివేకా హత్య కేసులో మరో చెల్లి సునీతా రెడ్డిని కూడా గత 5 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిప్పిస్తూనే ఉన్నారు. కనుక మంత్రి నారా లోకేష్ చెప్పినట్లు ‘జగన్ కోటా’ ఇంకా పూర్తవలేదనుకోక తప్పదు.




